పటిష్టంగా ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ  

17 Feb, 2023 16:39 IST|Sakshi

కడప సిటీ: పట్టభద్రులు, ఉపాధ్యాయ, స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించాలని కలెక్టర్‌ విజయరామరాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని వీసీ హాలులో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై జేసీ సాయికాంత్‌వర్మ, ఏఎస్పీ తుషార్‌డూడి, నగర పాలక సంస్థ కమిషనర్‌ జీఎస్‌ఎస్‌ ప్రవీణ్‌చంద్, అసిస్టెంట్‌ కలెక్టర్‌లు ‡రాహుల్‌మీనా, ప్రవీణ్, డీఆర్వో గంగాధర్‌గౌడ్‌తో కలిసి ఎన్నికల నోడల్‌ అధికారులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో గతంలో జరిగిన ఎన్నికల విజయవంతానికి ఏ విధంగా కృషి చేశారో అదే స్ఫూర్తితో ఈ ఎన్నికలను విజయవంతం చేయాలన్నారు. పోలింగ్‌ సిబ్బందిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరుగా లేని వారిని మాత్రమే నియమించాలన్నారు. వారి సొంత మండలంగానీ, వారు విధులు నిర్వర్తించే మండలానికిగానీ విధులను కేటాయించరాదన్నారు. ఎన్నికల కమిషన్‌ సూచనల మేరకు ఎన్నికల నియమ నిబంధనలను తప్పకుండా పాటించాలన్నారు.

ఎన్నికలకు అవసరమైన వాహనాలను రూట్‌ మ్యాప్‌ వేసుకుని ఆ ప్రకారంగా  సిద్ధం చేసుకోవాలన్నారు. ఎన్నికల పరంగా ఏవైనా ఫిర్యాదులు చేయాలనుకుంటే 1950 టోల్‌ఫ్రీ నంబరుకు కాల్‌ చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు ధర్మచంద్రారెడ్డి, వెంకట రమణ, జెడ్పీ సీఈఓ సుధాకర్‌రెడ్డి, డీపీఓ ప్రభాకర్‌రెడ్డి, సీపీఓ వెంకట్రావు, డ్వామా, డీఆర్‌డీఏ, మెప్మా, ఏపీఎంఐపీ పీడీలు యదుభూషణరెడ్డి, ఆనంద్‌ నాయక్, రామ్మోహన్‌రెడ్డి, రవీంద్రారెడ్డితోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు