గురుకుల పాఠశాలల నిర్వహణకు ఏర్పాట్లు

29 Aug, 2020 04:20 IST|Sakshi

9, 10, ఇంటర్‌ క్లాసుల నిర్వహణపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన అధికారులు 

ఒక్కో క్లాసులో 20 మంది విద్యార్థులు 

మిగిలిన తరగతుల వారికి ప్రస్తుతానికి ఆన్‌లైన్‌ క్లాసులు

సాక్షి, అమరావతి: గురుకుల విద్యా సంస్థల్లో క్లాసుల నిర్వహణకు సంబంధించి అధికారులు కొన్ని ప్రతిపాదనలను తయారు చేసి ప్రభుత్వానికి పంపించారు. కోవిడ్‌–19 వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో అన్ని క్లాసులు ఒకేసారి నిర్వహించడం వీలుకాదని అధికారులు ఇటీవల సమావేశమై ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి, గిరిజన సంక్షేమ శాఖ జాయింట్‌ సెక్రటరీ, ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి పాల్గొన్నారు. వీరు పంపిన సూచనలను ప్రభుత్వం పరిశీలించాల్సి ఉంది. అవేంటంటే..

► 2020–21 విద్యా సంవత్సరానికి గురుకుల విద్యాలయాల్లో 9, 10, ఇంటర్‌ తరగతులను మాత్రమే నిర్వహించాలి. 
► ప్రతి క్లాసును విద్యార్థుల సంఖ్య ఆధారంగా సెక్షన్లుగా విభజించాలి. ఒక్కో సెక్షన్‌లో 20 మంది విద్యార్థులు ఉండాలి. 
► క్లాసులకు హజరయ్యే వారు చేతులను శుభ్రం చేసుకోవడం కోసం వాష్‌ బేసిన్‌ల సంఖ్యను పెంచాలి. ప్రతి విద్యార్థికి 3 మాస్కులు, శానిటైజర్‌ ఇవ్వాలి. పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న నర్సులకు కోవిడ్‌–19పై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. 
► విద్యార్థులకు వైద్య చికిత్స అవసరమైనప్పుడు తీసుకెళ్లేందుకు వీలుగా మారుమూల గురుకుల పాఠశాలల వద్ద ఒక వాహనం అందుబాటులో ఉండాలి. 
► స్కూళ్ళకు సమీపంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని వైద్యులు నిత్యం అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. 
► గురుకులాల్లో మిగిలిన తరగతులు చదువుతున్న విద్యార్థులకు ‘విద్యామృతం’ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఆన్‌లైన్‌ ద్వారా పాఠాలు బోధించాలి. 
► కరోనా వ్యాధిపై ప్రభుత్వం, వైద్య శాఖ సూచనల మేరకు దశల వారీగా మిగిలిన క్లాసుల విద్యార్థులను కూడా గురుకులాలకు పిలిపించాలి. 

మరిన్ని వార్తలు