దేశంలో డిస్కంల బకాయిలు రూ.1,32,432 కోట్లు

10 Jul, 2022 03:06 IST|Sakshi

45 రోజుల గ్రేస్‌ పీరియడ్‌ తర్వాత కూడా రూ.1,15,128 కోట్ల బాకీ

ఆంధ్రప్రదేశ్‌ జెన్‌కోకు తెలంగాణ నుంచి రావాల్సింది రూ.6,627.28 కోట్లు

బకాయిల వసూలుకు జరిమానా చార్జీలను మాఫీచేసిన కేంద్రం

సాక్షి, అమరావతి: దేశంలో విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కంలు) విద్యుత్‌ ఉత్పత్తిదారులకు చెల్లించాల్సిన మొత్తం బకాయిలు రూ.1,32,432 కోట్లకు చేరాయి. గతేడాది జూన్‌లో రూ.1,27,306 కోట్ల బ కాయిలు ఉండగా ఈ ఏడాది నాలుగు శాతం పెరిగాయి.  ఉత్పత్తిదారులు, డిస్కంల మధ్య విద్యుత్‌ కొనుగోలు లావాదేవీల్లో పారదర్శకత తీసుకురావడానికి 2018 మే నెలలో  కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రాప్తి పోర్టల్‌ ఈ వివరాలను వెల్లడించింది. విద్యుత్‌ సరఫరాకు సంబంధించిన బిల్లులను క్లియర్‌ చేసేందుకు విద్యుత్‌ ఉత్పత్తిదారులు డిస్కంలకు 45 రోజుల గడువు ఇచ్చారు.

ఆ గడువు తర్వా త కూడా చెల్లించని మొత్తం రూ.1,15,128 కోట్లుగా ఉంది. ఇది ఏడాది కిందట ఇదే నెలలో రూ.1,04,095 కోట్లుగా ప్రాప్తి పోర్టల్‌ పేర్కొంది. దీన్లో మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, జమ్మూ–కశ్మీర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్‌లలోని డిస్కంలదే ఎక్కువ. తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్‌కోకు రూ.6,627.28 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. వీటిని వసూలు చేసి ఇప్పించాల్సిందిగా తాజాగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు.

జెన్‌కోల కోసం డిస్కంలకు రుణాలు
గడువు ముగిసిన తరువాత డిస్కంలు బకాయిలను ఆలస్యంగా చెల్లించినందుకు జెన్‌కోలు జరిమానా వడ్డీని వసూలు చేస్తుంటాయి. కానీ కేంద్రం ఈ జరి మానా సర్‌చార్జీలను మాఫీచేసింది. దీర్ఘకాలిక రుణాల గడువును పదేళ్ల వరకు పెంచుతూ గత మే నె లలో ప్రభుత్వం రూ.90 వేల కోట్ల లిక్విడిటీ ఇన్ఫ్యూషన్‌ స్కీమ్‌ (ఎల్‌ఐఎస్‌)ను ప్రకటించింది. తద్వారా డిస్కంలు పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎఫ్‌సీ), రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌ (ఆర్‌ఈసీ)ల నుంచి రుణాలు పొందాయి. ఆ తరువాత ఎల్‌ఐ ఎస్‌ ప్యాకేజీని రూ.1.35 లక్షల కోట్లకు పెంచారు. విద్యుత్‌ ఉత్పత్తి కంపెనీ (జెన్‌కో)లకు ఊరట కలిగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల జెన్‌కోలకు కట్టాల్సిన బకాయిలు చెల్లిస్తారని ప్రభుత్వం భావించింది.  

మరిన్ని వార్తలు