అచ్చెన్నా.. ఇదేందన్నా!

9 Feb, 2021 05:38 IST|Sakshi
పెద్దబమ్మిడిలో అచ్చెన్నాయుడు ఫ్యామిలీ నిర్మించిన గోడౌన్లు

అచ్చెన్నాయుడి కుటుంబ అవినీతి బాగోతం

కాలువలు, ప్రభుత్వ భూములు ఆక్రమించుకుని గోడౌన్ల నిర్మాణం

ఆ భూములు కూడా తమపేరుతో రిజిస్ట్రేషన్‌

పాత రికార్డులు మాయం

అన్నల అండగా 2007–19 మధ్య చెలరేగిన తమ్ముడు

ఆక్రమిత భూముల్లో కట్టిన గోడౌన్ల ద్వారా అక్రమార్జన

12 ఏళ్లలో రూ.47 కోట్లకు పైగా అవినీతి 

రాజకీయం అండగా అక్రమాలు.. కండబలంతో దౌర్జన్యాలు.. బెదిరించి అధికారుల్ని లోబరుచుకోవడం.. రికార్డులు మాయం చేయడం.. ప్రభుత్వ భూముల్ని ఆక్రమించడం.. వాటిని చూపించి బ్యాంకుల్లో కోట్ల రూపాయల రుణాలు తీసుకోవడం.. ఆ భూముల్లో నిర్మించిన గోదాములను ప్రభుత్వ సంస్థకే లీజుకివ్వడం.. అక్రమంగా కోట్లాది రూపాయలు వెనకేసుకోవడం.. ఇవీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడి కుటుంబ వ్యవహారాలు. కాలువను, గోర్జి భూమిని కూడా ఆక్రమించేశారంటే వీరి తెగింపును అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు.. ప్రభుత్వ భూముల్ని కూడా తమపేరుతో రిజిస్టర్‌ చేసేసుకున్నారు. పాత రికార్డులు కనిపించకుండా చేసేశారు. వీటిగురించి తెలిసినా ప్రస్తావించేందుకు కూడా ఎవరూ సాహసించరు. ఎవరైనా సాహసిస్తే.. బెదిరించో, దండించో నోరు మూయిస్తారు.

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబ అవినీతికి అంతే లేకుండాపోయింది. అచ్చెన్నాయుడు అన్నదమ్ములు వ్యూహాత్మకంగా అక్రమాలకు పాల్పడ్డారు. ఎర్రన్నాయుడు ఉన్నంతకాలం ఆయన అండతో, ఆయన తర్వాత అచ్చెన్నాయుడు అండతో సోదరుడు కింజరాపు హరిప్రసాద్‌ చేసిన అవినీతి అంతా ఇంతా కాదు. నీరు చెట్టు పనుల్లో కోట్లు తినేశారు. రోడ్ల నిర్మాణాల్లో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలంలో తన స్వగ్రామమైన నిమ్మాడ సమీపంలోని పెద్దబమ్మిడి గ్రామంలో గోడౌన్ల ద్వారా గత 12 ఏళ్లలో రూ.47 కోట్లకుపైగా అక్రమార్జనకు పాల్పడ్డారు. అక్రమార్జనకు వేదికైన గోడౌన్లను ఏకంగా ప్రభుత్వ భూమిలోనే నిర్మించారు. సర్వే నంబరు 95, 96లో గోడౌన్, సర్వే నంబరు 106లో భవాని గ్రానైట్‌ పాలిషింగ్‌ యూనిట్‌ నిర్మించారు. ప్రభుత్వ భూమి, గోర్జి (పొలాలకు వెళ్లే దారి), సాగునీటి కాలువలు సుమారు 3.15 ఎకరాలు ఆక్రమించి ఈ నిర్మాణాలు చేశారు. ఆక్రమిత భూమిలో నిర్మించిన గోడౌన్లను చూపించి వివిధ బ్యాంకుల్లో కోట్లాది రూపాయల రుణాలు తీసుకున్నారు. 

ఆక్రమించిన భూములివే..
సర్వే నంబర్‌ 95–08లో 1.20 ఎకరాల నీటి కాలువ, సర్వే నంబర్‌ 95–11లో 51 సెంట్లు గోర్జి పోరంబోకు, సర్వే నంబర్‌ 96–6లో 11 సెంట్ల ప్రభుత్వ కాలువ భూమి, సర్వే నంబర్‌ 96–10లో 58 సెంట్ల ప్రభుత్వ గోర్జి భూమి, సర్వే నంబర్‌ 95–3లో 15 సెంట్ల ప్రభుత్వ కాలువ భూమి, సర్వే నంబర్‌ 96–3 లోగల 21 సెంట్లు ప్రభుత్వ గోర్జి భూమి, సర్వే నంబర్‌106–6పీలో 18 సెంట్లు, సర్వే నంబర్‌ 95–08పీలో 2 సెంట్లు, సర్వే నంబర్‌ 96–3పీలో గల 12 సెంట్లు, సర్వే నంబర్‌ 96–10పీలో 7 సెంట్లు.. మొత్తం 3.15 సెంట్లను కలిపేసుకుని గోడౌన్లను నిర్మించారు. ఈ భూములను ఆక్రమించడమే కాకుండా తన సోదరులు ఎర్రన్నాయుడు, అచ్చెన్నాయుడు, ప్రభాకర్‌ల భాగస్వామ్యంతో కోటబొమ్మాళి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ఈ భూములు చూపించి 2009లో కోటబొమ్మాళి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘానికి (పీఏసీఎస్‌కు) చైర్మన్‌గా ఉన్న కింజరాపు హరిప్రసాద్‌ కోట్ల రూపాయల రుణం తీసుకున్నారు. ఈ భూములనే చూపించి కొన్ని జాతీయ బ్యాంకుల్లో కూడా రుణాలు తీసుకున్నారు.  

రికార్డులు మాయం 
1989 నుంచి 2006 వరకు కోటబొమ్మాళి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో జరిగిన భూముల క్రయవిక్రయాల జాబితాల్లో లభించిన ఈసీల ప్రకారం పరిశీలిస్తే.. కింజరాపు హరిప్రసాద్‌ తన అన్నదమ్ముల సాయంతో సుమారు 7.86 ఎకరాలను రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. దీన్లో 3.15 ఎకరాల ప్రభుత్వ భూమి కూడా ఉంది. ఈ ఆక్రమణల పర్వంలో రెవెన్యూ రికార్డుల్ని మాయం చేశారు. రెవెన్యూ శాఖలో అతి కీలకమైన ఎస్‌ఎల్‌ఆర్‌ రికార్డుల్ని కూడా కనిపించకుండా చేశారు. ఇరిగేషన్‌ శాఖ, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ, వివిధ బ్యాంకులను మోసం చేశారు. ఈ క్రమంలో అధికారులను కూడా భయపెట్టారు.

గోడౌన్ల ముసుగులో అవినీతి
హరిప్రసాద్‌ 2003లో 10 వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో గోడౌన్లు నిర్మించారు. వీటిని 2004కి 20 వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యానికి, 2014కి 30 వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యానికి విస్తరించారు. 2007 నుంచి 2019 వరకు 12 ఏళ్లలో ఈ గోడౌన్ల నుంచి కోట్ల రూపాయలు అక్రమంగా ఆర్జించారు. టీడీపీ అధికారంలో ఉన్నంతవరకు జిల్లా పౌరసరఫరాల సంస్థ ఈ గోడౌన్లను లీజుకు తీసుకుని రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని నిల్వచేసేది. ఒక అక్నాలెడ్జ్‌మెంట్‌ (ఏసీకే.. అనగా 580 బియ్యం బస్తాలు)కి రెండు క్వింటాళ్ల వరకు మిల్లర్ల నుంచి అనధికారికంగా తరుగు కింద తీసుకునేవారు. వాస్తవంగా ప్రభుత్వమే 1.5 శాతం తరుగు అవకాశం ఇస్తుంది. ఈ లెక్కన మిల్లర్ల దగ్గర తీసుకున్నదంతా అదనమే. మిల్లర్లు తమ గోడౌన్‌లో ధాన్యం బస్తాలు నిల్వ చేయాలంటే అనధికారికంగా అడ్వాన్సు పేరిట రూ.ఐదువేలు వసూలు చేసేవారు.

గోడౌన్‌ ఫార్మాలిటీ కింద ఒక బస్తాకి రూ.1.60 పైసలు తీసుకునేవారు. వాస్తవానికి ప్రభుత్వమే బస్తాకి రూ.3.50 పైసలు అద్దె చెల్లిస్తుంది. హ్యాండ్లింగ్‌ కోసం రెండేళ్లకొకసారి టెండర్లు పిలవాల్సి ఉన్నా.. ఎప్పుడూ ఏకపక్షంగానే టెండర్‌ కొట్టేసేవారు. హ్యాండ్లింగ్‌ చార్జీలను ప్రభుత్వమే చెల్లిస్తుంది. కానీ మిల్లర్ల దగ్గరి నుంచి అనధికారికంగా వసూలు చేసేవారు. ఇవికాకండా వే బ్రిడ్జి కోసమని ఒక ఏసీకేకి రూ.250 వసూలు చేసేవారు. ఇలా అన్ని రకాలుగా సంవత్సరానికి 3 కోట్ల 96 లక్షల 60 వేల రూపాయల మేర అక్రమంగా ఆర్జించారు. ఈ రకంగా 12 సంవత్సరాలకు కలిపి 47 కోట్ల 59 లక్షల 20 వేల రూపాయల మేర కింజరాపు కుటుంబం అడ్డగోలుగా వెనకేసుకుంది. 1.80 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ గోడౌన్లు ప్రస్తుతం చదరపు అడుగుకు రూ.5 వంతున ఎఫ్‌సీఐ లీజులో ఉన్నాయి.

నా దగ్గర ఆధారాలున్నాయి
1983లో రాజకీయ అరంగేట్రం చేసిన కింజరాపు కుటుంబసభ్యులకు అప్పట్లో కేవలం రెండెకరాల పొలం మాత్రమే ఉండేది. ఇప్పుడు వేలకోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారు. నిమ్మాడ గోడౌన్‌ నిర్మాణంలో ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. ఆ భూమిని సొంతగా రిజిస్ట్రేషన్‌ చేసుకుని రెవెన్యూ రికార్డులను మాయం చేశారు. ప్రభుత్వ భూముల రికార్డులను మాయం చేసి వివిధ బ్యాంకుల్లో కోట్ల రూపాయల రుణాలు కాజేశారు. ప్రధాన కారకుడైన హరిప్రసాద్‌కు సోదరులు ఎర్రన్నాయుడు, అచ్చెన్నాయుడు, ప్రభాకర్‌ అండగా ఉండటంతో కొన్ని దశాబ్దాలుగా లెక్కలేని అక్రమాలు జరిగాయి. ప్రభుత్వ భూముల ఆక్రమణ, రికార్డులు మాయం చేసి బ్యాంకుల్లో కోట్ల రూపాయలు దోచుకోవడం, గోడౌన్‌ నిర్వహణలో అక్రమ వసూళ్లకు సంబంధించి నా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి. 
– దువ్వాడ శ్రీనివాస్, వైఎస్సార్‌సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త

ఫిర్యాదు వస్తే చర్యలు తీసుకుంటాం
కోటబొమ్మాళి మండలం పెద్దబమ్మిడిలో గోడౌన్‌ నిర్మాణంలో ప్రభుత్వ భూముల ఆక్రమణ జరిగినట్లు ఫిర్యాదు వస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఇదే గోడౌన్‌లో ఏడాది కిందట మండల సర్వేయర్లతో సర్వే చేయించాం. అప్పట్లో ప్రైవేట్‌ ల్యాండ్‌ అని నివేదిక ఇచ్చారు. 
– రమేష్‌బాబు, తహసీల్దారు, కోటబొమ్మాళి

భౌతికంగా ఉన్న పత్రాలతో రిజిస్ట్రేషన్లు చేస్తాం
భూముల రిజిస్ట్రేషన్ల విషయంలో భౌతికంగా ఉన్న పత్రాల మేరకు రిజిస్ట్రేషన్లు చేస్తాం. కొన్ని సర్వే నంబర్లకు ఆనుకుని ప్రభుత్వ భూములకు సంబంధించి సర్వే నంబర్లు ఉన్నప్పుడు అవి కూడా ప్రైవేటు భూమి యజమాని పేరుతో రిజిస్ట్రేషన్లు జరిగే అవకాశం ఉంది. 
– జి.రాజు, సబ్‌రిజిస్ట్రార్, కోటబొమ్మాళి 

మరిన్ని వార్తలు