అలుపెరుగని అథ్లెటిక్‌.. పరుగులో రారాజు 

8 Dec, 2021 09:22 IST|Sakshi

మల్కాపురం (విశాఖ పశ్చిమ): ఆయన వయసు 67 ఏళ్లు...అయినా 20 ఏళ్ల యువకుడిలా ఫిట్‌గా ఉంటాడు. ఎవరైనా సరే నాతో పరుగెత్తగలరా అంటూ సవాల్‌ విసురుతాడు. కచ్చితంగా గెలిచే తీరుతాడు.  60–75 ఏళ్ల విభాగంలో పోటీలో పాల్గొంటూ పతకాలు గొల్లగొడుతున్నాడు. అతనే ఇందిరాకాలనీకి చెందిన ఆకుల కనకరాజు.  

ఇప్పటికీ అదే ఉత్సాహం 
కనకరావుకు ఇప్పడు 65 ఏళ్లు. అయినా నిత్యయువకుడిలా పరుగులో రాణిస్తున్నాడు. తెల్లవారు జామునే నిద్ర లేవడం.. రన్నింగ్‌కు వెళ్లడం నిత్య దినచర్య. ప్రస్తుతం కనకరాజు షిప్‌యార్డ్‌ జూనియర్‌ కళాశాలలో పీఈటీగా పనిచేస్తున్నాడు. రన్నింగ్‌తో పాటు బాడీబిల్డింగ్, బాక్సింగ్, ఫుట్‌బాల్‌ వంటి క్రీడలు కనకరాజుకు అనుభవం ఉంది. ఆ క్రీడల్లో కూడా పతకాలు సాధించాడు.  

1972లో తొలిసారిగా.. 
1972లో ఇండియన్‌ నేవి  విశాఖలో ఏర్పాటు చేసిన పది కిలో మీటర్ల పరుగు పందెంలో తొలి స్థానంలో నిలిచాడు. అప్పటి నుంచి  ఏటా వివిధ రాష్ట్రాలలో జరిగే పరుగు పందెంలో పాల్గొని పతకాలు సాధించాడు. 65 ఏళ్ల వయసులో కూడా (2000వ సంవత్సరం) హరియానలో జరిగిన జాతీయ స్థాయి 4 మీటర్ల పరుగు పందెంలో తృతీయ స్థానంలో నిలిచాడు. వంద, రెండు వందలు ,మూడు వందలు, నాలుగు వందల మీటర్ల పరుగు పందెంలో ఇప్పటి వరకు నాలుగు వందల వరకు పతకాలు సాధించాడు. 

ఇప్పటి వరకు సాధించిన  పతకాలు 140
జీవీఎంసీ 60వ వార్డు పరిధి ఇందిరాకాలనీ– 1 ప్రాంతానికి చెందిన ఆకుల కనకరాజు అథ్లెటిక్స్‌ రాణిస్తు ఆదర్శంగా నిలుస్తున్నాడు. వయసు 67 ఏళ్లయినా వెనుకడుగు వేయకుండా పరుగులో నంబర్‌–1 గా నిలుస్తున్నాడు. పదో తరగతి పూర్తి చేసిన కనకరాజు ఇండియన్‌ ఆర్మీలో చేరాడు. అక్కడ అధికారులు ఇచ్చిన పోస్టు నచ్చక ఏడాదికి తిరిగి వచ్చాశాడు. విశాఖలో హోంగార్డుగా ఐదేళ్లు పనిచేశాడు.

అనంతరం సీలేరు వద్ద గల ప్రభుత్వ ఐటీఐలో మేల్‌ నర్స్‌గా చేరాడు. తరువాత విశాఖ సెంట్రల్‌ జైల్‌లో మేల్‌ నర్సింగ్‌ విధులు నిర్వహించి అక్కడే పదవీ విరమణ పొందాడు. కనకరాజు 13 ఏళ్ల వయసులోనే పరుగు మొదలు పెట్టాడు. షిప్‌యార్డ్, జింక్, పోర్టు గ్రౌండ్‌లో రన్నింగ్‌ ప్రాక్టిస్‌ చేశాడు. 

మరిన్ని వార్తలు