ఆయనకెలా తెలుసు.. చంద్రబాబు ఏమైనా కేబినెట్‌లో ఉన్నారా..?

19 Apr, 2022 12:07 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

సాక్షి, ప్రకాశం: ఆంధ్రప్రదేశ్‌లో మంత్రివర్గ విస్తరణపై ఇంకా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి ఆదిమూలపు సురేష్‌ కేబినెట్‌ కూర్పుపై స్పందించారు. ఆయన మీడియాతో మంగళవారం మాట్లాడుతూ.. ‘పాత మంత్రి వర్గంలో తామంతా రాజీనామా చేసిన తరువాతే తనకు అవసరమైన మంత్రి వర్గానికే ముఖ‍్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి అవకాశం కల్పించారు. అంతే తప్ప ఇతర కారణాలేవీ లేవు. వైఎస్సార్‌సీపీ తామంతా వైఎస్ జగన్ బొమ్మ పెట్టుకొని గెలిచిన వాళ్లమే. బాలినేనితో నాకు ఎటువంటి విభేదాలు లేవు. మంత్రి వర్గంలో స్థానం కోల్పోయిన వారికి భావోద్వేగాలు తప్పనిసరిగా ఉంటాయి. అవి నిదానంగా సర్ధుకుంటాయి’ అని ఆదిమూలపు పేర్కొన్నారు.  

‘సీఎం జగన్ ఆలోచన ప్రకారమే మేము నడుచుకుంటాం. అవినీతికి తావుండకూడదు అనేది సీఎం జగన్ నినాదం. కేబినేట్ మొత్తాన్ని మారుస్తామని సీఎం ఎప్పుడూ చెప్పలేదు. మొత్తం కేబినేట్‌ను మారుస్తానని ఆయన చెప్పినట్టు చంద్రబాబు అంటున్నారు.. ఈ విషయం ఆయనకు ఎలా తెలుసు..? చంద్రబాబు ఏమైనా కేబినెట్‌లో ఉన్నారా..?. వైఎస్సార్‌సీపీ కేబినేట్ మంత్రులమంతా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నాం. చంద్రబాబులో అభద్రతాభావం ఏర్పడింది. 

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు ఒక జెండా.. అజెండా అంటూ ఏమీలేదు. పల్లకి మోయడమే ఆయన అజెండా. అందుకే ఆయన వైఎస్సార్‌సీపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా వాటిన్నింటిని గుంపగుత్తగా వేరేవారికి అప్పచెబుతామనే సిద్దాంత ధోరణిని అవలంభిస్తున్నారు. దీనిని ఎవరైనా పార్టీ సిధ్దాంతం అంటారా?’ అని మంత్రి ఆది మూలపు సురేష్‌ ప‍్రశ్నించారు.
ఇది చదవండి: ఏపీలో మరో టూరిస్ట్‌ స్పాట్‌.. తప్పక చూడాల్సిందే..

మరిన్ని వార్తలు