ఏపీలో తెరుచుకోనున్న‌ ప‌ర్యాట‌క ప్రాంతాలు

31 Jul, 2020 14:13 IST|Sakshi

తిర‌గ‌నున్న‌ టూరిస్టు బ‌స్సులు

టెంపుల్ టూరిజంపై ఫోక‌స్‌

జిమ్‌ల‌ను ప్రారంభించేందుకు క‌స‌ర‌త్తులు

సాక్షి, అమ‌రావ‌తి: అన్ని జిల్లాల్లోని ప‌ర్యాట‌క ప్రాంతాల్లో వారం రోజుల్లో పర్యాటకులకు అనుమతిస్తామ‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ర్యాట‌క శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ప్ర‌క‌టించారు. పర్యాటక ప్రాంతాలన్నిటినీ మళ్ళీ అందుబాటులోకి తెస్తున్నామ‌ని వెల్ల‌డించారు. టూరిజం హోటళ్లను కూడా తెరుస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. శుక్ర‌వారం ఆయ‌న స‌చివాల‌యం నుంచి మాట్లాడుతూ.. ఆగ‌స్టు 15 నుంచి అన్ని చోట్ల నుంచి బోట్లు తిరిగేలా చర్యలు తీసుకుంటామ‌న్నారు. టూరిస్ట్ బస్సులను కూడా వారం రోజుల్లో సిద్ధం చేస్తామని తెలిపారు. త్వ‌ర‌లోనే జిమ్‌ల‌ను సైతం రాష్ట్రంలో ప్రారంభిస్తామన్నారు. టెంపుల్ టూరిజంను మ‌రింత‌ అభివృద్ధి చేస్తామ‌ని హామీ ఇచ్చారు. (రాష్ట్రంలో పెట్టుబడులపై అమెజాన్‌తో చర్చలు)

'ప్ర‌సాద్' స్కీం ద్వారా సింహాచ‌లం దేవ‌స్థానాన్ని అభివృద్ధి చేస్తామ‌ని, ఇప్ప‌టికే శ్రీశైలంలో 50 కోట్ల రూపాయ‌ల‌తో అభివృద్ధి పనులు చేప‌ట్టామ‌ని పేర్కొన్నారు. త్వ‌ర‌లోనే 4 క్రీడా వికాస కేంద్రాల‌ను ప్రారంభిస్తామ‌ని చెప్పుకొచ్చారు. ప్ర‌తిభ గ‌ల పేదల పిల్ల‌ల‌ను క్రీడల్లో ప్రోత్సహించాల‌ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారని, అందులో భాగంగా గ‌తేడాది 3 కోట్లు పేద క్రీడాకారుల‌కు అందించ‌గా, ఈ ఏడాది మ‌రో 3 కోట్ల‌ను కేటాయించార‌ని తెలిపారు. పీవీ సింధు అకాడ‌మీకి విశాఖ‌ప‌ట్నంలో భూములు కేటాయిస్తామని అవంతి శ్రీనివాస్ తెలిపారు. (వైఎస్‌ జగన్‌ భిక్షతోనే మీరు ఎంపీ అయ్యారు..)

మరిన్ని వార్తలు