ధాన్యం కొనుగోలుపై రైతులకు అవగాహన

22 Apr, 2022 18:35 IST|Sakshi

పిఠాపురం: ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలపై రైతులకు అవగాహన కల్పించాలని పౌర సరఫరాల కార్పొరేషన్‌ వీసీ, ఎండీ వీరపాండ్యన్‌ అన్నారు. మండలంలోని జల్లూరులోని రైతు భరోసా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన సందర్శించారు. రబీ సీజన్‌లో ధాన్యం సేకరణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలలో తేమ శా«తం, గోనె సంచుల నిల్వ, రైతుల రిజిస్ట్రేషన్‌ అంశాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించామన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన కనీస మద్దతు ధర లభించేలా అధికారులు చొరవ చూపాలన్నారు. కలెక్టర్‌ కృత్తికా శుక్లా మాట్లాడుతూ ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జాయింట్‌ కలెక్టర్‌ అలేఖ్య, పౌరసరఫరాల జెడ్‌ఎం మేనేజర్‌ డి.పుష్పామణి, జియం వి.లక్ష్మీరెడ్డి పాల్గొన్నారు.  

అధికారులకు జేడీ సూచనలు
జగ్గంపేట: రైతు భరోసా కేంద్రాలలో «ధాన్యం కొనుగోలుపై రైతులకు అవగాహన కలిగించాలని జిల్లా వ్యవసాయ అధికారి జె.విజయకుమార్‌ సూచించారు. జగ్గంపేట వ్యవసాయ మార్కెట్‌ కమిటి కార్యాలయంలో గురువారం జగ్గంపేట వ్యవసాయ సబ్‌ డివిజన్‌లోని కిర్లంపూడి, ఏలేశ్వరం, జగ్గంపేట,గండేపల్లి మండలాలల అధికారులు, సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోలు సందర్భంగా ఏర్పడుతున్న సమస్యలను అధికారులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.  వాటికి విజయ్‌కుమార్‌ పరిష్కారాలను చూపించారు. ప్రతి రైతు భరోసా కేంద్ర పరిధిలో ఒక కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్‌ గ్రూపు ఏర్పాటు చేయాలని ఏడీ చెప్పారు.

ప్రభుత్వం 40శాతం సబ్సిడీపై ఇస్తున్న వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను గ్రూపు ద్వారా కొనుగోలు చేయించి అందుబాటులో ఉంచాలన్నారు. భూమిలేని కౌలు రైతులను గుర్తించి కౌలు కార్డులు ఇప్పించాలన్నారు. పొలంబడులు నిర్వహించాలన్నారు. జగ్గంపేట వ్యవసాయ శాఖ ఏడీ బండారు నాగకుమార్, మండల వ్యవసాయ అధికారి ఇంటిగ్రేటెడ్‌ అగ్రీ ల్యాబ్‌ అధికారి కరుణాకర్‌రాజు, జగ్గంపేట మండల వ్యవసాయ అధికారి రెడ్ల శ్రీరామ్, వివిధ మండలాల వ్యవసాయ అధికారులు,రైతు భరోసా కేంద్రాల సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు