ఆనందయ్య కరోనా మందు: ల్యాబ్‌ నుంచి పాజిటివ్ రిపోర్ట్‌

22 May, 2021 11:20 IST|Sakshi

మందు తయారీ విధానంలో శాస్త్రీయత పరిశీలిస్తాం

అధ్యయనం తర్వాత నివేదికకు వారం రోజులు

ఆయుష్‌ కమిషనర్‌ రాములు

సాక్షి, నెల్లూరు: కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందుపై ఆయుష్‌ కమిషనర్‌ రాములు ఆధ్వర్యంలో అధ్యయనం కొనసాగుతోంది. ఆనందయ్య.. రాములు ఎదుట ఆయుర్వేద మందు తయారీని చూపించనున్నారు. ఈ సందర్భంగా రాములు మీడియాతో మాట్లాడుతూ, నిన్న(శుక్రవారం) ముత్తుకూరులో కొంతమందితో, ఆనందయ్య వద్ద పనిచేసేవారితో మాట్లాడామని తెలిపారు.

ఆనందయ్య మందును ఎలా తయారు చేస్తారో పరిశీలిస్తామని రాములు పేర్కొన్నారు. మందు తయారీలో వాడే పదార్థాలన్నీ శాస్త్రీయంగానే ఉన్నాయని.. మందు తయారీ పదార్థాలపై ల్యాబ్‌ నుంచి పాజిటివ్ రిపోర్టే వచ్చిందని రాములు వెల్లడించారు. ఆనందయ్య మందును తీసుకున్నవారి అభిప్రాయాలనూ సేకరిస్తామన్నారు. ఐసీఎంఆర్ బృందం పరిశీలిన తర్వాత వారితో కూడా కోఆర్డినేట్ చేసుకుంటామని ఆయన తెలిపారు. మందు తయారీ అధ్యయనం తర్వాత నివేదికకు వారం పైనే పడుతుందని రాములు వెల్లడించారు.

కృష్ణపట్నానికి టీటీడీ బృందం..
తిరుమల:
ఈవో ఆదేశంతో టీటీడీ బృందం కృష్ణపట్నానికి వెళ్లింది. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో టీటీడీ ఆయుర్వేద డాక్టర్‌తో కూడిన బృందం కృష్ణపట్నం చేరుకున్నారు. కరోనాతో ఇబ్బంది పడుతున్న టీటీడీ ఉద్యోగులకు ఆయుర్వేద మందు ఇవ్వాలనే ఆలోచనలో టీటీడీ ఉంది.

అప్పటివరకు కృష్ణపట్నం రావొద్దు: జేసీ
ఆనందయ్య ఆయుర్వేద మందుపై సీఎంఆర్, ఆయూష్‌ బృందాలు అధ్యయనం చేస్తున్నాయని జేసీ హరేంద్రప్రసాద్ తెలిపారు. నివేదిక వచ్చేందుకు వారం, 10 రోజులు పట్టొచ్చని.. ఫైనల్‌గా ప్రభుత్వ అనుమతి వచ్చిన తర్వాతే మందు పంపిణీ చేపడతామని ఆయన వివరించారు. అప్పటి వరకు ప్రజలెవరూ కృష్ణపట్నం రావొద్దని జేసీ స్పష్టం చేశారు.

చదవండి: ఆనందయ్య కరోనా మందుకు వారం పాటు బ్రేక్‌ 
కరోనాకు ఆనందయ్య మందు!

మరిన్ని వార్తలు