చంద్రబాబును అరెస్టు చేయాలి

14 Jan, 2021 04:37 IST|Sakshi
రిలే నిరాహార దీక్షలలో పాల్గొని నిరసన తెలియజేస్తున్న బహుజన పరిరక్షణ సమితి సంఘాల నాయకులు

దళిత బహుజన పరిరక్షణ సంఘాల డిమాండ్

తాడికొండ: చంద్రబాబుపై దేశద్రోహం కింద కేసు కట్టి అరెస్టు చేయాలని దళిత బహుజన పరిరక్షణ సమితి నేతలు డిమాండ్‌ చేశారు. అంబేడ్కర్‌ రాజ్యాంగ స్ఫూర్తికి అడ్డుపడితే దళిత ద్రోహి బాబును రాజకీయంగా బొందపెడతామని హెచ్చరించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు జంక్షన్‌లో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు బుధవారం నాటికి 105వ రోజుకు చేరుకున్నాయి. పలుంవురు దళిత నేతలు మాట్లాడుతూ.. చంద్రబాబు తన భార్య, కొడుకు, కోడలు, మనవడితో సంక్రాంతి పండుగ చేసుకుంటూ.. హక్కుల కోసం పోరాడుతున్న పేదలకు మాత్రం సంక్షేమం అందకుండా సైంధవుడిలా అడ్డుపడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బాబు బినామీ నిమ్మగడ్డకు ఎదురుదెబ్బ తగిలినా  బుద్ధి రాలేదన్నారు.  దేశంలోనే విచ్చిన్నకరమైన  ఉగ్రవాది చంద్రబాబు అని, రాజకీయాల కోసం మామ, తోడల్లుడికి వెన్నుపోటు పొడిచి నందమూరి వంశాన్ని కనిపించకుండా చేశాడని దుయ్యబట్టారు. పేదల సంక్షేమాన్ని అడ్డుకునేందుకు బాబు అండ్‌ కో  కోర్టుల్లో వేసిన కేసులు విత్‌డ్రా చేసుకుని, ముక్కు నేలకు రాసి దళితులు, బహుజనులకు క్షమాపణ చెప్పాలని సూచించారు. నాయకులు మాదిగాని గురునాథం, నత్తా యోనారాజు, పరిశపోగు శ్రీనివాసరావు, జూపూడి బాలస్వామి, పల్లె బాబు తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు