పేదల అభివృద్ధిని అడ్డుకుంటున్న చంద్రబాబు
బహుజన పరిరక్షణ సమితి నేతల ధ్వజం
మూడు రాజధానులకు మద్దతుగా 126వ రోజు రిలే నిరాహార దీక్షలు
తాడికొండ: స్థానిక సంస్థల ఎన్నికల్లో బహుజన వాదానిదే విజయమని, పేదల అభివృద్ధిని అడ్డుకుంటున్న చంద్రబాబుకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తామని బహుజన పరిరక్షణ సమితి నాయకులు పేర్కొన్నారు. మూడు రాజధానులకు మద్దతుగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సెస్ రోడ్డు జంక్షన్లో 126వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలకు పలువురు నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు.
స్థానిక ఎన్నికల్లో అధిక శాతం ఓట్లు బహుజనులవేనన్నారు. చంద్రబాబు పేదల అభివృద్ధిని అడ్డుకుంటూ కోర్టుల్లో వేసిన కేసులు ఉపసంహరించుకోవాలన్నారు. చంద్రబాబుపై కోర్టుల్లో ఉన్న స్టేలు తొలగించి విచారణకు స్వీకరించి వెంటనే జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు మాదిగాని గురునాథం, పరిశపోగు శ్రీనివాసరావు, నత్తా యోనారాజు తదితరులు పాల్గొన్నారు.