బాబు, పవన్, రామకృష్ణ ఇళ్లను ముట్టడిస్తాం

7 Jan, 2021 05:48 IST|Sakshi
మాట్లాడుతున్న జెర్రిపోతుల పరశురాం

బహుజన పరిరక్షణ సమితి హెచ్చరిక

రాజధానిలో 99వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు 

తాడికొండ: అభివృద్ధి వికేంద్రీకరణ, పేదలకు ఇంగ్లిష్‌ మీడియం విద్య, రాజధానిలో 54 వేల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోరుతూ 99 రోజులుగా పేదలు దీక్షలు చేస్తుంటే చంద్రబాబు అండ్‌ కో భూ కుంభకోణం నిందితులకు సహకరిస్తున్నారని బహుజన పరిరక్షణ సమితి నాయకులు మండిపడ్డారు. ఇకపై ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, చంద్రబాబుతో పాటు ఆయన తప్పుడు విధానాలకు వంతపాడుతున్న పవన్‌ కళ్యాణ్, సీపీఐ రామకృష్ణల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం తాళ్లాయపాలెం సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు జంక్షన్‌లో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలలో బుధవారం పలువురు నేతలు పాల్గొన్నారు.

రాష్ట్రంలో దళితులు, అగ్రవర్ణాల మధ్య చిచ్చుపెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అంబేడ్కర్‌ చిత్రాన్ని కరెన్సీ నోట్లపై ముద్రించాలని ఇండియన్‌ కరెన్సీపై అంబేడ్కర్‌ ఫొటో సాధన కమిటీ (ఐసీఏపీఎస్‌ఎస్‌) జాతీయ అధ్యక్షుడు జెర్రిపోతుల పరశురాం డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బహుజన పరిరక్షణ సమితి నేతలు పరిశపోగు శ్రీనివాసరావు, మాదిగాని గురునాథం, నత్తా యోనారాజు, ఇందుపల్లి సుభాషిణి తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు