ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చింతామణి నాటక ప్రదర్శనను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సాంçస్కృతిక, పర్యాటక, యువజనుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ్ జీవో నంబరు 7 జారీ చేశారు.
హర్షం వ్యక్తం చేసిన ఆర్యవైశ్య సంఘాలు..
వైశ్యులను కించపరిచే విధంగా ఉన్న చింతామణి నాటక ప్రదర్శనను నిషేధించాలన్న ఆర్యవైశ్యుల విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, ఈ విషయంలో ప్రభుత్వానికి ఆర్యవైశ్యులంతా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నిర్ణయం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆర్య వైశ్యుల పట్ల ప్రేమాభిమానాలు చూపి వెంటనే చింతామణి నాటక ప్రదర్శన నిలిపివేయాలని నిర్ణయం తీసుకోవడంపై ఆర్యవైశ్య వెల్ఫేర్ –డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ మరొక ప్రకటనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.