నాయీ బ్రాహ్మణులను కించపరిచే పదాలపై నిషేధం

11 Aug, 2022 11:29 IST|Sakshi

సాక్షి, అమరావతి: నాయీ బ్రాహ్మణులను, వారి సామాజికవర్గాన్ని కించపరిచే పదాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధం విధించింది. మంగలి, మంగలోడా, బొచ్చుగొరిగేవాడా, మంగలిది, కొండ మంగలి తదితరాలను నాయీబ్రాహ్మణులను ఉద్దేశించి ఉపయోగిస్తే.. వారి మనోభావాలను గాయపరిచినట్టుగా పరిగణిస్తారు. అందుకు బాధ్యులైన వారిపై భారత శిక్షాస్పృతి 1860 కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి జీవో ఎంఎస్‌ 50 జారీ చేశారు. ఆగస్టు 7న జారీ చేసిన ఈ జీవో బుధవారం వెలుగులోకి వచ్చింది. 

సర్వత్రా హర్షం
కులదూషణను నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై నాయీ బ్రాహ్మణులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెల్పుతున్నారు. సీఎం చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. జీవో ఎంఎస్‌ 50ను విస్తృతంగా ప్రచారం చేసి ఆత్మగౌరవాన్ని కాపాడుకుందామని నాయీ బ్రాహ్మణ సంఘ నాయకులు పిలుపునిచ్చారు. (క్లిక్: ఏదినిజం.. గోబెల్స్‌ను మించిన రామోజీ!)

తెలంగాణలోనూ అమలు చేయండి
నాయీ బ్రాహ్మణులను కించపరిచే పదాలను ఏపీ ప్రభుత్వం నిషేధించడం పట్ల తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మద్దికుంట లింగం నాయి హర్షం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నాయీ బ్రాహ్మణుల ఆత్మగౌరవాన్ని కాపాడటానికి తెలంగాణలోనూ ఇటువంటి జీవో తేవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. (క్లిక్: గోరంట్ల మాధవ్‌ పేరిట వైరల్‌ అవుతున్న వీడియో ఒరిజినల్‌ కాదు)

మరిన్ని వార్తలు