అరటి రైతుకు మహర్దశ

17 May, 2022 18:11 IST|Sakshi

సాక్షి, అమరావతి: అరటి రైతుకు మహర్దశ పట్టనుంది. విత్తు నుంచి విపణి వరకు ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలవనుంది. దిగుబడుల్లో నాణ్యత పెంచడం, ఎగుమతులను రెట్టింపు చేయడమే లక్ష్యంగా రూ.269.95 కోట్లతో కార్యాచరణ సిద్ధం చేసింది. రానున్న మూడేళ్లలో వైఎస్సార్, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో క్లస్టర్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు (సీడీపీ)ని అమలు చేయనుంది. 

గడిచిన మూడేళ్లలో లక్ష టన్నుల ఎగుమతులు 
రాష్ట్రంలో 2,02,602 ఎకరాల్లో అరటి సాగవుతుండగా, 48.62 లక్షల టన్నుల దిగుబడులతో దేశంలో నం.1 స్థానంలో ఉంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో 23వేల టన్నులు ఎగుమతులు జరుగగా, కరోనా పరిస్థితులున్నప్పటికీ గడిచిన మూడేళ్లలో లక్ష టన్నులకు పైగా అరటి ఎగుమతులు చేయగలిగారు. దేశంలోనే తొలిసారి తాడిపత్రి నుంచి ముంబైకు ప్రత్యేక రైలు ద్వారా అరటిని ఎగుమతి చేసి చరిత్ర సృష్టించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న వాల్యూచైన్‌ ప్రాజెక్టు వల్ల హెక్టార్‌కు 24 టన్నుల వరకు దిగుబడులు, టన్నుకు రూ.12వేల వరకు ఆదాయం పెరిగింది. ఎగుమతులను ప్రోత్సహించే  లక్ష్యంతో అనంతపురంలో రెండు ప్యాక్‌ హౌస్‌లు, రెండు కోల్డ్‌ స్టోరేజ్‌లు నిర్మించగా, పులివెందులలో ప్యాక్‌ హౌస్‌ నిర్మాణ దశలో ఉంది.   

42,500 ఎకరాల్లో క్లస్టర్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు 
తాజాగా ఉద్యాన ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించే లక్ష్యంతో జాతీయ ఉద్యాన బోర్డు దేశవ్యాప్తంగా 12 క్లస్టర్స్‌ను ఎంపిక చేయగా, ఏపీలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి  అరటి ఎగుమతులను ప్రోత్సహించనున్నారు. అరటి ఎక్కువగా సాగవుతున్న వైఎస్సార్, అనంతపురం, కర్నూలు, జిల్లాలను ఈ ప్రాజెక్టు కోసం ఎంపిక చేశారు.  మూడు జిల్లాల పరిధిలో గుర్తించిన 42,500 ఎకరాల్లో సీడీపీ ప్రాజెక్టును అమలు చేసేందుకు రూ.269.95కోట్లతో ప్రణాళిక సిద్ధం చేసింది.

ఈ మొత్తంలో రూ.100 కోట్లు గ్రాంట్‌ రూపంలో అందించనుండగా, మిగిలిన మొత్తాన్ని పీపీపీ కింద సమీకరించనున్నారు. క్లస్టర్‌ గ్యాప్‌ అసెస్‌మెంట్‌ రిపోర్టు ఆధారంగా ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే ప్రాంతంలో మొక్కల నుంచి ఎగుమతి వరకు మూడు దశల్లో రైతులకు సపోర్టు ఇవ్వనున్నారు. విత్తు నుంచి కోత (ప్రీ ప్రొడక్షన్‌ – ప్రొడక్షన్‌)వరకు రూ.116.50 కోట్లు, కోత అనంతర నిర్వహణ–విలువ ఆపాదించడం (పోస్ట్‌హార్వెస్ట్‌ మేనేజ్‌మెంట్, వాల్యూఎడిషన్‌) కోసం రూ.74.75కోట్లు, ఎగుమతులకు అవసరమైన లాజిస్టిక్స్, మార్కెటింగ్,  బ్రాండింగ్‌ కల్పనకు రూ.78.70కోట్లు ఖర్చు చేయనున్నారు.  

అరటికి కేరాఫ్‌ ఏపీ 
ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా గడిచిన 
మూడేళ్లలో అరటి ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. వీటిని మరింత పెంచే లక్ష్యంతో ప్రభుత్వం రూ.269.95 కోట్లతో క్లస్టర్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టును అమలు చేస్తోంది. ఈ ప్రాజెక్టుతో ఎగుమతుల్లో ఏపీకి త్వరలో అంతర్జాతీయఖ్యాతి లభించనుంది. 
–డాక్టర్‌ ఎస్‌ఎస్‌ శ్రీధర్, కమిషనర్, ఉద్యాన శాఖ 

రైతుకు చేయూత ఇలా.. 
సాగుకు అవసరమైన నాణ్యమైన టిష్యూ కల్చర్‌ మొక్కల నుంచి మైక్రో ఇరిగేషన్, సమగ్ర సçస్యరక్షణ (ఐఎన్‌ఎం), సమగ్ర ఎరువులు, పురుగు మందుల యాజమాన్యం(ఐపీఎం), ఫ్రూట్‌ కేర్‌ యాక్టివిటీ వరకు ఒక్కో రైతుకు గరిష్టంగా హెక్టార్‌కు రూ.40వేల వరకు ఆర్థిక చేయూతనివ్వనున్నారు. తోట బడుల ద్వారా15వేల మందికి సాగులో మెళకువలపై శిక్షణనిస్తారు.

సాగుచేసే ప్రతీ రైతుకు గుడ్‌ అగ్రికల్చర్‌ ప్రాక్టీసెస్‌ సర్టిఫికేషన్‌ (జీఏపీ)ఇస్తారు. కోతలనంతర నిర్వహణకు అవసరమైన ప్యాక్‌ హౌసెస్, కోల్డ్‌ స్టోరేజ్‌లు, ఎయిర్‌పోర్టులు, రైల్వేస్టేషన్లలో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైనపెట్టుబడులు అందించడంతో పాటు బ్రాండింగ్, విదేశాల్లో ప్రమోçషన్‌ వంటి కార్యకలాపాలకు ఆర్థిక చేయూతనందిస్తారు.

(చదవండి: సీమసిగలో మెగా పవర్‌ ప్రాజెక్ట్‌.. సీఎం జగన్‌ చేతులమీదుగా శంకుస్థాపన)

మరిన్ని వార్తలు