దటీజ్‌ సీఎం జగన్‌.. సాయం కోరితే సత్వరమే అందుతుంది మరి

21 Dec, 2022 19:39 IST|Sakshi

సాక్షి, బాపట్ల: అన్నా.. కష్టంలో ఉన్నాం. సాయం అందించన్నా.. అనే మాట వింటే చాలూ ఆయన చలించి పోతారు. సమస్యల్లో ఎవరైనా ఉన్నారని తెలిస్తే చాలూ.. సత్వర సాయంతో అక్కడికక్కడే ఆ సమస్యను పరిష్కరించి మనసున్న మారాజుగా పేరు దక్కించుకున్నారు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ఎన్నో కుటుంబాలు అలా నేరుగా ఆయన ద్వారా సాయం అందుకున్న ఉదంతాలు చూశాం. అలాంటి జననేత మరోసారి బాపట్ల పర్యటనలో మానవత్వం చాటుకున్నారు.  

బుధవారం చుండూరు మండలం యడ్లపల్లిలో ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమం అనంతరం తిరుగు ప్రయాణంలో సీఎంని కలిసి తమ ఇబ్బందులు వివరించిన మోదుకూరు గ్రామానికి చెందిన గుండ్రెడ్డి వెంకటరెడ్డి, వలివేరు గ్రామానికి చెందిన కూచిపూడి విద్యాసాగర్‌లు. స్పందించిన సీఎం వైఎస్‌ జగన్‌.. ప్రభుత్వం తరపున సహాయం చేస్తానని హామీ, అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఆ వెంటనే..

ముఖ్యమంత్రి ఆదేశాలతో వెంటనే ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున.. దివ్యాంగులకు చెక్కులు అందజేశారు బాపట్ల జిల్లా కలెక్టర్‌ కే. విజయకృష్ణన్‌. 

మోదుకూరు గ్రామానికి చెందిన గుండ్రెడ్డి వెంకటరెడ్డి కుమారుడు, కుమార్తె పుట్టుకతోనే మానసిక వైకల్యంతో బాధపడుతున్నారు. అయితే నిబంధనల కారణంగా వాళ్లకు ఫించన్‌ రావడం లేదు. దీంతో ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు గండ్రెడ్డి సీఎం జగన్‌ వద్ద మొరపెట్టుకున్నారు.  అలాగే.. వలివేరు గ్రామానికి చెందిన కూచిపూడి విద్యాసాగర్‌ భవనం నిర్మిస్తూ ప్రమాదవశాత్తూ మూడంతస్తుల నుండి కిందపడ్డారు. అప్పటి నుంచి  కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నట్లు సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. వాళ్ల కష్టం చూసి సీఎం జగన్‌ చలించి పోయారు. వెంటనే స్పందించి గండ్రెడ్డి, కూచిపూడి కుటుంబాలకు తక్షణమే అవసరమైన ఆర్ధిక సాయం చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. 

సీఎం స్పందనతో బాధిత కుటుంబాలు సంతోషాన్ని వ్యక్తం చేశాయి. తమ సమస్యపై ఇంత త్వరగా సీఎం జగన్‌ స్పందించడం, వెంటనే తమకు సాయం చేయడం ఎన్నడూ మరువలేమని వారు తమ ఆనందాన్ని జిల్లా కలెక్టర్‌తో పంచుకున్నారు

మరిన్ని వార్తలు