ఇంజనీరింగ్‌ చదివే సమయంలో బస్సు డ్రైవర్‌తో ప్రేమ, పెళ్లి.. తల్లికి ఆరోగ్యం బాగోలేదని చెప్పి..

3 May, 2022 15:08 IST|Sakshi

సాక్షి, బాపట్ల(వేమూరు): ప్రేమ పెళ్లి చేసుకున్న యువతి కిడ్నాప్‌కు గురైన ఘటన సోమవారం అనంతవరంలో చోటుచేసుకుంది. పోలీసులు, యువతి భర్త కథనం మేరకు.. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం శివలూరుకు చెందిన ఆళ్ల లక్ష్మీపూజిత, తెనాలి సమీపంలోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఇంజనీరింగ్‌ చదివే సమయంలో అదే కళాశాల బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్న కొల్లూరు మండలం అనంతవరానికి చెందిన దేవరాజుగట్టు విశ్వనాథ్‌లు  ప్రేమించుకున్నారు. యువతి చదువు పూర్తయిన అనంతరం గత నెల 11న పెద్దలకు తెలియకుండా ప్రేమ వివాహం చేసుకుని కొల్లూరు పోలీసులను ఆశ్రయించారు. అప్పట్నుంచి తన భర్త రాజవిశ్వనాథ్‌తో కలసి అనంతవరంలో ఉంటుంది. 


యువతిని బలవంతంగా లాక్కెళుతున్న తండ్రి, సోదరుడు, బంధువులు

తల్లికి అనారోగ్యమని.. 
లక్ష్మీపూజిత తల్లికి ఆరోగ్యం బాగోలేదని సోమవారం ఉదయం అనంతవరంలోని లక్ష్మీపూజిత అత్తగారింటికి తాతయ్య, మేనత్త, పిన్ని వచ్చారు. ఇకపై ఇరు కుటుంబాలు కలసి మెలసి ఉందామని నమ్మబలికారు. దీంతో  లక్ష్మీపూజిత ఇంటి నుంచి బయటకు రావడంతో ఆమెను బలవంతంగా లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. అప్పటికే అక్కడ ఉన్న యువతి తండ్రి శ్రీనివాసరెడ్డి, సోదరుడు నిరంజన్‌రెడ్డి, కొంతమంది యువకులు లక్ష్మీపూజితను బలవంతంగా కారులో తీసుకెళ్లారు. అడ్డువచ్చిన భర్త, అత్తపై దాడికి పాల్పడ్డారు. భర్త రాజవిశ్వనాథ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కిడ్నాప్‌ కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ కె.బాబూరావు తెలిపారు. 
చదవండి: ఊరుకాని ఊరులో.. మానవత్వానికి సలాం

మరిన్ని వార్తలు