బాపట్లలో విషాదం: చెట్టు మీదే ప్రాణం విడిచిన చిన్నారి.. గ్రామస్తుల కంటతడి

22 Jan, 2023 18:08 IST|Sakshi

సాక్షి, బాపట్ల: జిల్లాలో ఆదివారం విషాదకర ఘటన చోటు చేసుకుంది. కొరిశపాడు మండలం దైవాల రావూరులో ఆటాడుకుంటూ విద్యుత్‌ తీగలు తగిలి ఓ చిన్నారి చెట్టు మీదే కన్నుమూశాడు. మరో చిన్నారి ఈ ఘటనలో గాయపడి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు ఆదివారం కావటంతో.. స్థానికంగా ఉన్న సాయిబాబా గుడి ఎదురుగా ఉన్న చెట్టు మీద ఎక్కి  ఆడుకుంటున్నారు. ఈ తరుణంలో.. చెట్టు మధ్యలో ఉన్న కరెంటు తీగలు గమనించక ముందుకు వెళ్లారు. దీంతో విద్యుద్ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు ఓ చిన్నారి. ఇక మరో చిన్నారి కరెంట్‌ షాక్‌ దెబ్బకు కింద పడిపోయి గాయాలపాలయ్యాడు. 

మృతి చెందిన చిన్నారి గడ్డం బుజ్జి కుమారుడు అఖిల్ గా స్థానికులు గుర్తించారు. మరొక బాలుడిని చికిత్స నిమిత్తం మేదరమెట్ల లోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ప్రాణం విడిచి చెట్టు మీదే పడి ఉన్న చిన్నారి అఖిల్‌ మృతదేహం చూసి గ్రామస్తులంతా విలపించారు.

మరిన్ని వార్తలు