నేటి నుంచి బీసీ గురుకుల స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం

23 Nov, 2020 04:06 IST|Sakshi

కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు

సాక్షి, అమరావతి: బీసీ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో 9, 10వ తరగతి, ఇంటర్‌ విద్యార్థులకు సోమవారం నుంచి తరగతులు ప్రారంభమవుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టింది. ఏ ఒక్కరూ కరోనా వైరస్‌ బారిన పడకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ముందుగా తల్లిదండ్రుల సమ్మతి లేఖతో విద్యార్థులు గురుకులాలకు రావలసి ఉంటుంది. నాలుగు మాస్కులు వెంట తెచ్చుకోవాలి. గురుకులాల వద్ద విద్యార్థులను థర్మల్‌ స్కానర్‌లతో సంస్థ వైద్య బృందం పరీక్షిస్తుంది. కోవిడ్‌ లక్షణాలు ఉన్నట్లు అనుమానం వస్తే ఆ విద్యార్థిని వెంటనే తిరిగి ఇంటికి çపంపిస్తారు. కాగా క్లాసులు ఉదయం 8:15 నుండి సాయంత్రం 1:30 వరకు జరుగుతాయి. క్యాంపస్, హాస్టల్, డైనింగ్‌ హాల్, మరుగుదొడ్లు ఇలా ప్రతిచోటా విద్యార్థులు సురక్షిత వాతావరణంలో ఉండేలా చర్యలు తీసుకున్నారు. బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణమోహన్‌ వివరాలు వెల్లడించారు.

► చేతులు కడుక్కునేందుకు సబ్బు, హ్యాండ్‌ శానిటైజర్లు ఏర్పాటు.
► అందుబాటులో స్టాఫ్‌ నర్సులతో కూడిన ఆరోగ్య బృందాలు 
► విద్యార్థుల ఆరోగ్యం గురించి తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు సమాచారం.
► ముందుజాగ్రత్త చర్యగా ప్రతి పాఠశాలలో ఐసోలేషన్‌ రూమ్‌ / వార్డ్‌ ఏర్పాటు
► ప్రతి తరగతి గదిలో 16 మందికి మించకుండా విద్యాబోధన.
► ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, ట్యాబ్‌లు, పెన్సిళ్లు, లైబ్రరీ పుస్తకాలు, క్రీడా సామగ్రి వాడకం తాత్కాలికంగా నిలిపివేత. 
► వసతి గృహంలో విద్యార్థులు మంచం, తువ్వాళ్లు, దుస్తులు, బూట్లు, సాక్స్‌లు వంటి తమ వస్తువులు దూరంగా, విడివిడిగా ఉంచుకునేలా ఏర్పాటు.
► మరుగుదొడ్లు, బాత్‌రూములను రోజుకు మూడుసార్లు శుభ్రం చేయాలి.
► అల్పాహారం, మధ్యాహ్న, రాత్రి భోజనానికి ముందు, ఆ తర్వాత డైనింగ్‌ హాల్‌ శుభ్రపరుస్తారు. 
► ప్రతి విద్యార్థి తమ సొంత ప్లేట్, గ్లాసు, వాటర్‌ బాటిల్‌ తీసుకెళ్లాలి.
► సాధారణ అసెంబ్లీ ఉండదు. విద్యార్థులు ఆటలు ఆడుకునేందుకు అనుమతి లేదు.  

మరిన్ని వార్తలు