R Krishnaiah: సీఎం జగన్‌కు థ్యాంక్స్‌.. నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

17 May, 2022 18:20 IST|Sakshi
సీఎం జగన్‌కు శాలువ కప్పిన ఆర్‌ కృష్ణయ్య

సాక్షి, తాడేపల్లి: బీసీల మీద సీఎం జగన్‌ చూపుతున్న ప్రేమను.. మరే సీఎం చూపలేదన్నారు ఆర్‌ కృష్ణయ్య. రాజ్యసభ అభ్యర్థిగా ఆర్‌ కృష్ణయ్య పేరును వైఎస్సార్‌సీపీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆర్‌ కృష్ణయ్య స్పందించారు. 

మొదట్నుంచీ సీఎం జగన్‌.. బీసీలంటే బ్యాక్ బోన్ అంటూనే ఉన్నారు. అన్నట్టుగానే బీసీలకి అధిక ప్రాదాన్యత ఇస్తూ వస్తున్నారు. కోట్లు ఖర్చు పెట్టి రాజ్యసభ పదవులు కొనే పరిస్థితి వైఎస్సార్‌సీపీలో ఉండదన్న కృష్ణయ్య.. అదే ఉంటే తనలాంటోడు రాజ్యసభకు వెళ్తాడా? అని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీలోనే అన్ని వర్గాలకూ న్యాయం జరుగుతోందని, సీఎం జగన్ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఆర్‌ కృష్ణయ్య తెలిపారు.

రాజ్యసభ అభ్యర్థిగా తన పేరును ప్రకటించినందుకుగానూ ఆర్‌ కృష్ణయ్య.. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆపై మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యసభకు పంపుతున్నందుకు సీఎం జగన్‌కు కృతజ్ణతలు తెలియజేసేందుకు వచ్చానని అన్నారు. దశాబ్దాలుగా బీసీ ,ఎస్సీ ఎస్టీల అభ్యున్నతి కోసం తాను పోరాడుతున్నానని, ఆ అంకిత భావాన్ని గుర్తించి సేవ చేసే అవకాశం సీఎం జగన్‌ కల్పించారని,  బీసీలకు సీఎం జగన్ ఇస్తోన్న ప్రాధాన్యతను చూసి దేశంలో అందరూ ప్రశంసిస్తున్నారని చెప్పారు. 

తన సేవలను వైస్సార్‌సీపీలో ఉన్న నేతలంతా మనస్పూర్తిగా అంగీకరిస్తారని ఆకాంక్షిస్తున్నట్లు కృష్ణయ్య తెలిపారు. పార్టీ కండువా కప్పుకోపోయినా.. తాను వైఎస్సార్‌సీపీలో చేరినట్లేనని, అలాగే బీసీల కోసం తన పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు