పండగ వాతావరణంలా బీసీ సంక్రాంతి సభ

17 Dec, 2020 11:13 IST|Sakshi

సాక్షి, అమరావతి: విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో గురువారం బీసీ సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయ 10 గంటలకు ప్రారంభమైన ఈ సభలో బీసీలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. నెల రోజుల ముందే సంక్రాంతి పండగ వచ్చిందనే విధంగా బీసీలు సంబరాలు జరుపుకున్నారు. బీసీ సంక్రాంతి సభకు ముఖ్యమం‍త్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతిరావ్‌ పూలే, దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రజనుద్దేశించి ప్రసంగించారు. 

దేశ, రాష్ట్ర చరిత్రలో ఇదివరకెన్నడూ లేని విధంగా 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం.. వాటికి చైర్మన్లు, డైరెక్టర్లను ప్రకటించడం తెలిసిందే. కేబినేట్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 60 శాతం మంత్రి పదవులు కల్పించగా, నామినేట్‌ పదవుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించారు. చదవండి: బీసీల సంక్రాంతి

వెనుకబడిన కులాల అభివృద్ధి కోసం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి,  ప్రతీ సంక్షేమ పథకం కార్పొరేషన్ల ద్వారానే అమలు చేయననున్నారు. ఒక్కో కార్పొరేషన్‌లో 13 మంది డైరెక్టర్లు ఉన్నారు. దీని ద్వారా 2కోట్ల 83లక్షల 57వేల మంది బీసీలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. రూ.37,931 కోట్ల మేర ప్రభుత్వం లబ్ధి చేకూర్చింది. ఈ నేపథ్యంలో వారందరి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బీసీల సంక్రాంతి పేరుతో నిర్వహిస్తున్నారు. ఇందులో సగానికి పైగా పదవులను మహిళలకు కేటాయించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు హాజరయ్యారు. పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

మహిళలకు ప్రాధాన్యం 

బీసీలు అంటే నమ్మకానికి ప్రతీక అని మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ పేర్కొన్నారు. బీసీలకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని, నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించామని తెలిపారు. గత పాలకులు బీసీల సంక్షేమాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. బీసీలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న ఏకైక సీఎం జగన్ అని ప్రశంసించారు. 

139 కులాలకు కార్పొరేషన్లు ప్రకటించిన ఘనత సీఎం జగన్‌దే కార్పొరేషన్‌ పదవులలో మహిళలకు ప్రాధాన్యం ఇచ్చారని ఎమ్మెత్యే విడదల రజనీ అన్నారు. సంక్షేమ పథకాల్లో బీసీలే  అధికంగా లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. బీసీల అభివృద్ధికి సీఎం జగన్‌ కృషిచేస్తున్నారన్నారు. పేద బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి సీఎం జగన్‌ అని కొనియాడారు. 

రాజకీయ చరిత్రలోనే ఇదొక సువర్ణాధ్యాయమని ఎంపీ మోపిదేవి వెంకట రమణ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి, బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని ఆయన అన్నారు.

పేదలకు అండగా నిలిచారు
దేశం అంతా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లాంటి ముఖ్యమంత్రి కావాలని కోరుకుటున్నారని పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు తెలిపారు. ఈ రోజు వెనుకబడిన జాతులకు స్వాతంత్ర్యం వచ్చిన రోజు అని ఆయన అన్నారు. మాట నిలుపునే మనిషి మడమ తిప్పని సీఎం వైఎస్‌ జగన్‌ను తమిళనాడు, పుదుచ్చేరి రాష్టాలు కోరుకుంటున్నాయన్నారు. కరోనా సమయంలో పధకాలతో పేదలకు అండగా నిలిచారని అభివర్ణించారు. 139 బీసీ కులాలకు అండగా నిలిచిన వ్యక్తి సీఎం జగన్‌ అని అన్నారు. వెనుకబడిన జాతుల వ్యక్తిగా తమ పార్టీకి సేవ చేస్తానని స్పష్టం చేశారు. సంక్రాంతి, క్రిస్మస్ కన్నా వెనుకబడిన జాతులకు ఈరోజు స్వాతంత్ర్యం వచ్చిన రోజు అని అన్నారు.

ఆ బాధ్యత మనందరిపై ఉంది
వెనుక బడిన జాతులకు వెన్నుపోటు పొడిచి నాయకులను గతంలో చూశామని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘నేడు తన క్యాబినెట్‌లో బీసీలకు ఏడుగురురికి.. మంత్రులుగా వెనుక బడిన వారికి అయిదు డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చారు. 139 బీసీ కులాలకు 56 కార్పొరేషన్లు ఇచ్చిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డిది. ఇద్దరు బీసీ నాయకులను రాజ్యసభకు పంపారు. ఇలాంటి మహానాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ప్రతిప్రక్ష నాయకుడు చేస్తున్న కుతంత్రాలు, సింహాల్లా తిప్పి కొట్టాలి. విద్యా, వైద్యంలో బడుగులకు ప్రాధాన్యత ఇచ్చారు. మరో 30 సంవత్సరాలు రాష్ట్రానికి సీఎంగా జగన్‌మోహన్‌రెడ్డి కొనసాగుతారు.’ అని పేర్కొన్నారు. 

బీసీలు అంటే భారత దేశ సాంస్కృతిక అన్న నాయకుడు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అని మంత్రి వేణుగోపాల్‌ కృష్ణ అన్నారు. 56 బీసీ కార్పొరేషన్లు,673 డైరెక్టర్ల పోస్టుల్లో మహిళలకు పెద్ద పీట వేశారన్నారు. బీసీల గుండెల్లో గుడి కట్టుకున్న వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి అని, బీసీ అధ్యాయన కమిటీతో వెనుక బడిన కులాలు గుర్తించారన్నారు. పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకున్న నేత సీఎం జగన్‌ అని పేర్కొన్నారు. 

బీసీ వర్గాలకు మేలు చేసిన మహానాయకుడు
బీసీలకు సంక్రాంతి నెల ముందే వచ్చిందని ఎమ్మెల్సీ జంగా కృష్ణ మూర్తి పేర్కొన్నారు. దేశంలో అన్ని వర్గాలు అభివృద్దే దేశ అభివృద్ధి అని అంబేద్కర్ తెలిపారని, ఆయన ఆశయాలతో సీఎం పాలన సాగిస్తున్నారన్నారు. ‘3,648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర ద్వారా పేదల కష్టాలు తెలుసుకున్నారు. బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతుయి. దేశంలో బీసీ కులాల 139 బీసీ కులాలు ఉన్నాయి. ప్రతి కులాన్ని వదిలి పెట్టకుండా 56  కార్పొరేషన్లు ,673 డైరెక్టర్ల ఇచ్చారు. గత పాలకులు కేవలం బీసీలను ఓటు బ్యాంకుగానే చూశారు. బీసీ వర్గాలకు మేలు చేసిన మహానాయకుడు సీఎం జగన్‌. అని అన్నారు. 

ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎంలు, కృష్ణ దాస్,అంజాద్ బాష, మంత్రులు, బొత్ససత్యనారాయణ, అనిల్ కుమార్ యాదవ్,వేణుగోపాల కృష్ణ, శంకర్ నారాయణ, జయరాం, సీదిరి అప్పల్ రాజు,అవంతి శ్రీనివాస్,కొడాలి నాని,పేర్ని నాని,కన్నబాబు, అదిమూలపు సురేష్, ఎంపీలు,బాల శౌరి, మోపిదేవి వెంకట రమణ, సుభాష్ చంద్రబోస్,భరత్, నదిగాం సురేష్, తదితరులు హాజరయ్యారు.

మరిన్ని వార్తలు