గత నెలలో 30 కోవిడ్ సెంటర్లుండగా ఇప్పుడు 81కి పెంపు
81 కోవిడ్ కేర్ సెంటర్లలో మొత్తం 41,780 బెడ్లు
వీటిలో చికిత్స పొందుతున్నవారు 9,937 మంది
ఇంకా అందుబాటులో 31,843 బెడ్లు
సాక్షి, అమరావతి: కోవిడ్ విజృంభిస్తుండటంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ కోవిడ్ కేర్ సెంటర్లను భారీగా పెంచింది. గత నెల రెండో వారంలో రాష్ట్రంలో 30 కోవిడ్ కేర్ సెంటర్లు మాత్రమే ఉండగా పక్షం రోజుల్లోనే అంటే.. ఈ నెల 2 నాటికి ఈ సంఖ్య 81కి చేరుకుంది. ఈ సెంటర్లలో మొత్తం 41,780 బెడ్లు ఉన్నాయి. లక్షణాలు లేకుండా పాజిటివ్ వచ్చిన వారిని ఈ సెంటర్లలో ఉంచి వైద్యుల నిరంతర పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు.
తద్వారా తీవ్ర లక్షణాలు ఉన్నవారిని ఆస్పత్రులకు పంపుతున్నారు. కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో ఆస్పత్రుల్లోనే కాకుండా కోవిడ్ కేర్ సెంటర్లలో కూడా భారీగా బెడ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 81 కోవిడ్ కేర్ సెంటర్లలో 9,937 మంది చికిత్స పొందుతుండగా ఇంకా 31,843 బెడ్లు అందుబాటులో ఉన్నాయి.
ఈ సెంటర్లలో రోగులకు వైద్య సేవలతోపాటు భోజనాన్ని కూడా ప్రభుత్వమే అందిస్తోంది. నర్సులు, ఏఎన్ఎంలతోపాటు వైద్యులు నిత్యం వీరిని పర్యవేక్షిస్తున్నారు. కోవిడ్ తగ్గుముఖం పట్టగానే రోగులను ఇంటికి పంపుతున్నారు. 104కు కాల్ చేస్తే కోవిడ్ కేర్ సెంటర్లలో వెంటనే బెడ్ పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.