కొత్త సినిమా లింకులని కక్కుర్తిపడితే.. ఖేల్‌ ఖతం

22 Apr, 2022 11:29 IST|Sakshi

వాట్సాప్‌ గ్రూపుల్లో కొత్త లింకులతో జాగ్రత్త

నకిలీ పేమెంట్‌ యాప్‌లతోనూ మోసాలు

బ్యాంకుల్లో వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు

రెండు రోజుల క్రితం కొన్ని వాట్సాప్‌ గ్రూపుల్లో ‘ది కాశ్మీర్‌ ఫైల్స్‌’సినిమా లింక్‌ వచ్చింది. సినిమా చూడాలన్న ఆసక్తితో చాలామంది లింక్‌ ఓపెన్‌ చేశారు. రెండు నిముషాలు సినిమా వచ్చింది. తర్వాత కొత్త లింక్‌ రావడంతో కొందరు దాన్ని క్లిక్‌ చేశారు. అంతే బ్యాంకు ఖాతాలోని డబ్బు మాయమైంది. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేక బాధపడుతున్నారు.

కడపలోని ఏడు రోడ్ల కూడలిలోని ఓ మొబైల్‌ షాపునకు ఇద్దరు యువకులు వచ్చి ఫోన్‌ కొన్నారు. ఫోన్‌ పే ద్వారా డబ్బు చెల్లించారు. ‘అమౌంట్‌ రిసీవ్‌డ్‌ సక్సెస్‌ఫుల్లీ’ అంటూ రావడంతో మొబైల్‌ షాపు యజమాని ఓకే అన్నారు. తర్వాత చెక్‌ చేస్తే ఒక్క పైసా అమౌంటు బ్యాంకు ఖాతాలో జమ కాలేదు. తీరా చూస్తే నకిలీ ఫోన్‌ పే యాప్‌ ద్వారా చెల్లంపులు చేశారని తేలింది.

తెలంగాణలో మహేష్‌ కో ఆపరేటివ్‌ బ్యాంకు మెయిల్‌కు ఓ లింక్‌ వచ్చింది. సిబ్బంది దాన్ని క్లిక్‌ చేశారు. అంతే బ్యాంకులోని సొమ్ము మాయమైంది. ఇందులో బ్యాంకు సిబ్బందితోపాటు నైజీరియా దేశస్తులను తెలంగాణ పోలీసులు ఇటీవల అరెస్ట్‌ చేశారు.

సాక్షి, కడప కార్పొరేషన్‌/అర్బన్‌: మొబైల్‌ ఫోన్ల ద్వారా జరుగుతున్న లావాదేవీలు ఆన్‌లైన్‌ మోసగాళ్లకు అవకాశంగా మారుతున్నాయి. వివిధ మార్గాల్లో వేలకు వేలు కొల్లగొడుతున్నారు. బ్యాంకు ఖాతాల నుంచి ఉన్నట్టుండి డబ్బు మాయమై పోతోంది. చివరకు ఫోన్‌ పే, గూగుల్‌ పే వంటి పేమెంట్‌ యాప్‌లు కూడా నకిలీవి సృష్టించి మోసం చేస్తున్నారు. అమాయకులకు వివిధ వాట్సాప్‌ గ్రూపుల ద్వారాగానీ, నంబర్ల నుంచిగానీ నేరుగా వెబ్‌సైట లింకులు పంపించడం, వాటిని నొక్కితే ఖాతాల నుంచి డబ్బు మాయమవడం పరిపాటిగా మారింది. ఇలాంటి మోసాలపై బ్యాంకు మేనేజర్లకు పిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కడపలోని ఓ బ్యాంకులో నెల రోజుల వ్యవధిలోనే 50 ఫిర్యాదులు వచ్చాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

బ్యాంకుల్లో భద్రమనుకుంటే...
బయట ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి వస్తాయో, రావోనన్న భయం. ఇంట్లో భద్రం కాదని అనుమానంతో బ్యాంకుల్లోనే దాచుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు. కానీ అక్కడ కూడా భద్రత ఉండటం లేదని పలువురు వాపోతున్నారు. ఒకవైపు డిజిటల్‌ సేవలు అంటూ ప్రచారం చేస్తున్నారు. కానీ మొబైల్‌ సేవల కోసం వెళితే డబ్బులు ఎగిరిపోతున్నాయి. దీనిపై బ్యాంకులను, పోలీసులను ఆశ్రయించినా ప్రయోజనం ఉండటం లేదు. 2021లో యోనో కేవైసీ, ఫేక్‌ మనీ యాప్స్, ఫ్లిప్‌కార్ట్‌ లాటరీ, గిఫ్ట్‌ మనీ, క్రెడ్‌ యాప్, ఓటీపీ, ఇన్‌స్రూె ఓఎల్‌ఎక్స్, జాబ్, ఏనీ డెస్క్‌ వంటి వాటి ద్వారా 326 మంది రూ.50.04లక్షలు మోసపోయారు. ఎఫ్‌ఐఆర్‌ వరకూ రాని సంఘటనలు చాలానే ఉన్నాయి.

ఏఈపీఎస్‌ ద్వారా కూడా మోసాలు
సైబర్‌ నేరగాళ్లు ఆధార్‌ ఎనేబుల్‌ పేమెంట్‌ సిస్టమ్‌(ఏఈపీఎస్‌) ద్వారా కూడా మోసాలకు పాల్పడుతున్నారు. గడిచిన రెండు మాసాల్లో దీని ద్వారా మోసపోయిన బాధితులు చాలా మంది ఉన్నారు. ఏటీఎం సౌకర్యం లేని ప్రాంతాల్లో నగదును తీసుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ఏఈపీఎస్‌ పద్ధతిని ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఫింగర్‌ ప్రింట్‌ సాయంతో రోజుకు రూ.10వేల వరకూ డ్రా చేసుకునే అవకాశం ఉంది. దీంతో సైబర్‌ నేరగాళ్లు రూపాల్లో ప్రజల వేలిముద్రలు సేకరించి ఏఈపీఎస్‌ ద్వారా డబ్బులు దోచేçస్తున్నట్లు తెలుస్తోంది.

ఇలాంటివి చేయొద్దు
►కొత్త నంబర్ల నుంచి వచ్చే వెబ్‌సైట్‌ లింకులపై క్లిక్‌ చేయకూడదు.
►ఎవరైనా క్యాష్‌ ఇవ్వండి. ఫోన్‌ పే చేస్తామని అడిగితే నిరాకరించండి. నకిలీ యాప్‌ ద్రావా పంపితే అమౌంట్‌ వచ్చినట్లు చూపుతుంది. కానీ మన ఖాతాలో జమ కాదు.  
►ఇటీవల హిట్‌ అయిన సినిమాల పేర్లతో లింకులు వస్తున్నాయి. వీటిని క్లిక్‌ చేయడం వల్ల మన ఖాతాల్లో డబ్బు మాయమవుతుంది.
►మన ఫోన్‌ ఇతరులకు ఇవ్వొద్దు. క్యూఆర్‌ కోడ్‌ వంటి వివరాలను వారి ఫోన్‌ సాయంతో తస్కరించి మోసాలకు పాల్పడే అవకాశం ఉంది.
►ఆన్‌లైన్‌ బ్యాంకింగ్, పేమెంట్‌ యాప్‌లకు సంబంధించిన పాస్‌వర్డ్‌లు గోప్యంగా ఉంచుకోవాలి.  
►ఫోన్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ పాస్‌వర్డ్‌లు నమోదు చేయకూడదు. 

బ్యాంకులు లింకులు పంపవు
చాలాసార్లు పాన్‌కార్డు, ఆధార్‌కార్డు లింక్‌ కాలేదని బ్యాంకుల పేరుతో లింకులు వస్తుంటాయి. కానీ ఏ బ్యాంకులు అలా చేయవు. అలా వచ్చాయంటే నకిలీవని గుర్తించాలి. తెలియని కాల్స్, మెయిల్స్‌పై క్లిక్‌ చేయవద్దు. వెబ్‌సైట్‌ ద్వారా ఆధార్‌ను లాక్‌ చేసుకోవాలి. రుణాలు ఇస్తామని, క్రెడిట్, డెబిట్‌ కార్డు గడువు తీరిపోయాయని ఎవరైనా ఫోన్‌ చేసి ఓటీపీలు అడిగితే చెప్పకూడదు.
– దుర్గాప్రసాద్, జిల్లా లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌

సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
సైబర్‌ నేరగాళ్ల వలలో పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి లింక్‌లు క్లిక్‌ చేయవద్దు. సామాజిక మాధ్యమాల్లో గుర్తు తెలియని వ్యక్తుల మెసేజ్‌లకు స్పందించవద్దు. ముఖ్యంగా బ్యాంకుల పేరుతో వచ్చే కాల్స్‌కు, ఓటీపీలు చెప్పవద్దు. సైబర్‌ నేరాల నియంత్రణకు ప్రత్యేకంగా ఒక విభాగం ఏర్పాటు చేశాం. ఈ మేరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.
 – కేకేఎన్‌ అన్బురాజన్, వైఎస్సార్‌ జిల్లా ఎస్పీ 

మరిన్ని వార్తలు