భారతి సిమెంట్‌ వితరణ 

14 May, 2021 03:46 IST|Sakshi

 కోవిడ్‌ బాధితుల కోసం ఆక్సిజన్‌ ట్యాంక్, వైద్య పరికరాలు 

కడప ఎంపీ, కలెక్టర్‌ కోరగానే అందించిన యాజమాన్యం

సాక్షి, కడప: ప్రస్తుత కరోనా కష్టకాలంలో బాధితులకు అండగా నిలిచేందుకు భారతి సిమెంట్‌  యాజమాన్యం ముందుకొచ్చింది.  కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీలో భాగంగా భారతి సిమెంట్‌ యాజమాన్యం వైద్య సేవలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తోంది. వైఎస్సార్‌ జిల్లాలో కరోనాతో ఇబ్బందులు ఎదురవుతున్న ప్రస్తుత తరుణంలో ఆక్సిజన్‌ సమస్యపై కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ హరికిరణ్‌లు భారతి సిమెంట్‌ పరిశ్రమ డైరెక్టర్‌ జేజే రెడ్డి, కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌ సాయి రమేష్‌లతో చర్చించారు.

వెంటనే స్పందించిన యాజమాన్యం సుమారు రూ.60 లక్షల పైచిలుకు విలువజేసే ఆక్సిజన్‌ ట్యాంక్‌తో పాటు వైద్య పరికరాలను యుద్ధ ప్రాతిపదికన గుజరాత్‌ నుంచి తెప్పించి అప్పగించారు. గురువారం సాయంత్రం ఆక్సిజన్‌ ట్యాంక్‌ కడప రిమ్స్‌కు చేరుకుంది. ట్యాంక్‌తో పాటు వైద్య పరికరాలనూ సిద్ధం చేశారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ కొరత వెంటాడుతున్న తరుణంలో ఆక్సిజన్‌ ట్యాంక్‌తో పాటు వైద్య పరికరాలు అందించడంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.   

మరిన్ని వార్తలు