సికింద్రాబాద్‌ కోర్టుకు అఖిలప్రియ!

6 Jan, 2021 18:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బోయిన్‌పల్లి కేసులో కిడ్నాపర్లపై ఐపీసీ సెక్షన్‌ 448, 419, 341, 342, 506, 366 విత్‌ 149 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ‌ కేసులో టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను బుధవారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇదే కేసుకు సంబంధించి అఖిల ప్రియ భర్త భార్గవ్‌ రామ్ పరారీలో ఉండగా‌, ఆయన సోదరుడు చంద్రబోసును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్‌ తర్వాత వీరిని బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడ నుంచి అఖిల ప్రియను బేగంపేట్‌ ఉమెన్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించి స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. అనంతరం గాంధీ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షల నిర్వహించారు. కాసేపట్లో నిందితులను సికింద్రాబాద్‌ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.  చదవండి: (బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసు‌: ఆ ముగ్గురు క్షేమం)

నిందితులను అరెస్ట్‌ చేశాం: సీపీ అంజనీ కుమార్‌
కాగా, బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసుకు సంబంధించి సీపీ అంజనీ కుమార్‌ సాక్షితో మాట్లాడారు. 'కిడ్నాప్‌ కేసులో నిందితులను అరెస్ట్‌ చేశాము. ఈ కేసులో పూర్తి విచారణ కొనసాగుతంది. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, బోయిన్‌పల్లి పోలీసులు విచారణ చేస్తున్నారు. మాకు బాధితులు ఇచ్చిన ఫిర్యాదులో ఎవరిపైఅయితే అనుమానం వ్యక్తం చేశారో వారినే అదుపులోకి తీసుకున్నాం. కిడ్నాప్‌కి గురైన ముగ్గురు వ్యక్తులను కూడా సేఫ్‌గా తీసుకొచ్చాము. కేసులో లోతైన దర్యాప్తు చేస్తున్నాము' అని సీపీ అంజనీ కుమార్‌ వివరించారు. 


మంగళవారం అర్థరాత్రి ముఖ్యమంత్రి సమీప బంధువులైన మాజీ క్రీడాకారుడు ప్రవీణ్‌రావు(51), సునీల్‌రావు(49), నవీన్‌రావు (47)లను కొందరు దుండగులు కిడ్నాప్‌ చేశారు. రాత్రి 7.30 సమయంలో ఐటీ అధికారులమంటూ ఆయన ఇంటి లోపలకు వెళ్లినవారు.. ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవరెడ్డి పేరును ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అనంతరం ముగ్గురినీ అక్కడ నుంచి బలవంతంగా తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న నార్త్‌జోన్‌ డీసీపి కల్మేశ్వర్, సెంట్రల్‌ జోన్‌ డీసీపీ అక్కడికి చేరుకున్నారు. డైమండ్‌ పాయింట్, రాణిగంజ్‌ మీదుగా రెండు అనుమానిత వాహనాలు వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల ద్వారా గుర్తించి వాటిని పట్టుకున్నారు. చదవండి: (భూమా ఫ్యామిలీకి ఎంత చెప్పినా వినలేదు)

మరిన్ని వార్తలు