ఆర్కే బీచ్‌లో వివాహిత అదృశ్యం.. భర్త కళ్లుగప్పి ప్రియుడితో..

27 Jul, 2022 19:22 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: వైజాగ్‌ ఆర్కే బీచ్‌లో రెండు రోజుల క్రితం అదృశ్యమైన సాయి ప్రియ మిస్సింగ్‌ కేసులో ఊహించని ట్విస్ట్‌ చోటుచేసుకుంది. అధికారులు, పోలీసులను ఉరుకులు, పరుగులు పెట్టించిన వివాహిత అదృశ్యం వెనుక పక్కా ప్లాన్‌ బయటపడింది. సోమవారం ఆర్కే బీచ్‌లో కనిపించకుండా పోయిన వివాహిత సాయిప్రియ నెల్లూరులో ప్రత్యక్షమైంది.

ఆమె ఆఖరి ఫోన్‌కాల్‌ను పోలీసులు కావలిలో ట్రేస్‌ చేశారు. ప్రియుడితో కలిసి సాయిప్రియ రైల్లో నెల్లూరు జిల్లాకు పరారైనట్లు తేలింది. సాయిప్రియ అదృశ్యమైన సమయంలో బీచ్‌ రోడ్‌లోనే ఆమె ప్రియుడు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ముందుగా వేసుకున్న ప్లాన్‌ ప్రకారమే భర్తను బురిడి కొట్టించి లవర్‌ సాయితో పరారైనట్లు బయటపడింది. 


చదవండి: బీచ్‌లో గల్లంతయ్యిందా..? లేక ఇంకేమైనా జరిగిందా..?

అసలేం జరిగిందంటే
చిరిగిడి సాయి ప్రియ, శ్రీనివాస్‌​  భార్యభర్తలు. కానీ సాయి ప్రియ కొంతకాలంగా రవితో ప్రేమాయణం సాగిస్తోంది. సోమవారం పెళ్లి రోజు కావడంతో భర్త శ్రీనివాస్‌తో కలిసి ఆర్కే బీచ్‌కు వెళ్లింది. శ్రీనివాస్‌ ఫోన్‌లో మెసెజ్‌లు చూస్తుండగా.. అలలు దగ్గరకు వెళ్తానని చెప్పింది. దీన్నే అవకాశంగా భావించిన సాయిప్రియ రాత్రి 7.30 గంటల సమయంలో ప్రియుడితో కలిసి బీచ్‌ నుంచి పారిపోయింది. భార్య కనిపించకపోవడంతో సముద్రంలో కొట్టుకుపోయి ఉంటుందని కంగారు పడిన శ్రీనివాస్‌ వెంటనే పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు.

పక్కా ‍స్కెచ్‌
ప్రమాదవశాత్తు సాయిప్రియ సముద్రంలో పడిపోయి ఉంటుందని భావించిన అధికారులు.. వివాహిత ఆచూకీ కోసం సముద్రంలో రెస్క్యూ ఆపరేషన్‌ మొదలు పెట్టారు. ముందుగా గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో నావీ సాయం కోరారు. దీంతో రెడు కోస్ట్‌ గార్డ్‌ షిప్‌లతో పాటు ఓ హెలికాప్టర్‌తో సముద్రం మొత్తం గాలించారు. అయినా జాడ దొరకలేదు. అయితే చివరకు అమ్మాయి సముద్రంలో గల్లంతు కాలేదని, ప్రియుడితో కలిసి నెల్లూరుకు చెక్కేసినట్లు తేలింది. ఎంతోమందిని టెన్షన్‌ పెట్టిన సాయిప్రియ మిస్సింగ్‌ చివరకు డ్రామాగా తేలడంతో అందరూ విస్తుపోయారు.

మరిన్ని వార్తలు