తంతడి తీరానికి అతిపెద్ద అతిథి

23 Dec, 2021 05:38 IST|Sakshi
తంతడి సముద్ర తీరానికి వచ్చిన వేల్‌ షార్క్‌

దొండపర్తి (విశాఖ దక్షిణ): ప్రపంచంలోనే అతి పెద్ద చేపగా గుర్తించబడిన వేల్‌ షార్క్‌ విశాఖ తీరానికి వచ్చింది. ఇక్కడి తంతడి బీచ్‌లో బుధవారం స్థానిక మత్స్యకారుల వలకు చిక్కింది. 50 అడుగుల పొడవు, 2 టన్నుల బరువు ఉండే చేప ఒడ్డుకు రావడాన్ని గమనించిన వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ శ్రీకాంత్‌ మన్నెపూరి వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారాన్ని తెలియజేశారు.

విశాఖ డీఎఫ్‌వో అనంత్‌శంకర్‌ ఆదేశాల మేరకు సిబ్బంది వెంటనే తంతడి బీచ్‌కు చేరుకొని ప్రపంచంలోనే అతిపెద్ద చేప అయిన వేల్‌షార్క్‌గా దీనిని నిర్ధారించారు. అంతరించిపోతున్న షార్క్‌ల జాతిలో ఇదొకటిగా గుర్తించారు. షార్క్‌ను సురక్షితంగా సముద్రంలోకి పంపించే ఏర్పాట్లు చేయాలని డీఎఫ్‌వో అనంత్‌శంకర్‌ సూచించారు. వెంటనే అటవీ శాఖ సిబ్బంది, మత్స్యకారులు, వన్యప్రాణుల సంరక్షకులు షార్క్‌కు ఫిల్టర్‌ ఫీడింగ్‌ ఇచ్చారు. అనంతరం షార్క్‌ను సురక్షితంగా సముద్రంలోకి పంపించారు.

చిక్కింది టేకు చేప..

మత్స్యకారుల వలకు భారీ టేకు చేప చిక్కింది. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ గ్రామ సమీపంలోని కృష్ణా నదిలో బుధవారం చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు పోస సాయికృష్ణ, ఉట్టి వెంకటేశ్వర్లు, గంగరాజులు వేసిన వలలో 200 కిలోల బరువున్న ఈ భారీ టేకు చేప పడింది.            
 – దాచేపల్లి  

మరిన్ని వార్తలు