సహకార రంగం తోడ్పాటుతోనే సుస్థిర అభివృద్ధి

24 Nov, 2020 05:23 IST|Sakshi

సాక్షి, అమరావతి: దేశ సామాజిక, ఆర్థిక వ్యవస్థను సుస్థిరపరచడంలో సహకార వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. పుణెలోని వైకుంఠ్‌ మెహతా సహకార నిర్వహణ సంస్థ స్నాతకోత్సవంలో సోమవారం విజయవాడ రాజ్‌భవన్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా గవర్నర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ దేశంలో పాడి విప్లవానికి సహకార రంగమే నాందిగా నిలిచిందన్నారు. ఇఫ్కో, క్రిబ్కో, అమూల్‌ వంటి సంస్థలు సహకార రంగంలో గణనీయమైన విజయాలు సాధించాయని చెప్పారు.

విద్య, పరిశోధన రంగాల్లో ప్రభుత్వం, సహకార, కార్పొరేట్‌ సంస్థలకు వైకుంఠ్‌ మెహతా సహకార నిర్వహణ సంస్థ విలువైన సేవలు అందిస్తోందని గవర్నర్‌ కొనియాడారు. దేశంలో కొత్తగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టం–2020 ద్వారా వ్యవసాయ రంగంలో తీసుకువచ్చిన సంస్కరణలను విజయవంతం చేయడంలో ఈ సంస్థ భాగస్వామి కావాలని గవర్నర్‌ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైకుంఠ్‌ మెహతా సహకార నిర్వహణ సంస్థ డైరెక్టర్‌ కె.కె.త్రిపాఠి, గవర్నర్‌ కార్యదర్శి ముఖేశ్‌ కుమార్‌ మీనా తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు