బాలాజీ వైద్య కళాశాల ప్రారంభోత్సవంలో గవర్నర్
సాక్షి, అమరావతి: సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు నిరుపేదలకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వేతర సంస్థలు కూడా కృషి చేయాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆకాంక్షించారు. తిరుపతిలో నెలకొల్పిన బాలాజీ వైద్య కళాశాల, ఆస్పత్రి, పరిశోధన కేంద్రాన్ని ఆయన విజయవాడ రాజ్భవన్ నుంచి వర్చువల్ విధానంలో బుధవారం ప్రారంభించారు. నూతన ఆస్పత్రితో రాయలసీమ వాసులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని ఈ సందర్భంగా గవర్నర్ చెప్పారు. పేదలకు నాణ్యమైన వైద్య సేవలందించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని సూచించారు. కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని.. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి, హైటెక్ గ్రూప్ చైర్మన్ తిరుపతి పాణిగ్రాహి తదితరులు పాల్గొన్నారు.
ప్రజల హక్కుల పరిరక్షణకు రాజ్యాంగమే చుక్కాని..
దేశ సర్వతోముఖాభివృద్ధి, ప్రజల హక్కుల పరిరక్షణలో భారత రాజ్యాంగం చుక్కానిగా నిలుస్తోందని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. దేశ సమగ్రతను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు.