గాడ్సేపై ప్రశంసలు.. ట్వీట్‌ తొలగింపు!

16 Nov, 2020 13:36 IST|Sakshi
బీజేపీ నేత రమేష్‌ నాయుడు(ట్విటర్‌ ఫొటో)

అమరావతి: నాథూరామ్‌ గాడ్సేను నిజమైన దేశ భక్తుడిగా అభివర్ణించిన ఏపీ బీజేపీ నేత రమేష్‌ నాయుడు నాగోతు తన ట్వీట్‌ను డెలిట్‌ చేశారు. సోషల్‌ మీడియాలో విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ‘‘నా ట్విటర్‌ను హ్యాండిల్‌ చేస్తున్నవారు అభ్యంతరకరమైన పోస్టు పెట్టారు. దానిని, వారి సేవలను తొలగించడమైనది’’ అంటూ వివరణ ఇచ్చారు. నవంబరు 15న గాడ్సే వర్ధంతిని పురస్కరించుకని.. ‘‘నేడు నాథూరాం గాడ్సే వర్ధంతి. ఈ సందర్భంగా ఆయన పట్ల కృతజ్ఞతాభావం చాటుకుంటున్నా. భరతభూమిలో ముందెన్నడూ ఇలాంటి గొప్ప దేశభక్తుడు జన్మించలేదు’’అని నివాళులు అర్పించారు. (చదవండి: ఇలాంటివి రాసే బాబుకు 23 ఇచ్చారు: సోము)

ఈ క్రమంలో నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. జాతిపిత మహాత్మా గాంధీ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ గతంలో రమేష్‌ నాయుడు చేసిన పోస్టును, గాడ్సేను ప్రశంసిస్తూ చేసిన ట్వీట్‌ను పోలుస్తూ .. రాజకీయాల కోసమే రెండు నాల్కల ధోరణి అవలంబిస్తున్నారా అంటూ ధ్వజమెత్తారు. దీంతో ట్వీట్‌ను డెలిట్‌ చేయడంతో పాటుగా తన ట్విటర్‌ ఖాతాను నిర్వహిస్తున్న వారికి కూడా ఉద్వాసన పలికినట్లు రమేష్‌ నాయుడు మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు