సాక్షి, విశాఖపట్నం : భారతదేశంలో రాజ్యాంగం పటిష్టంగా ఉందని, రాజ్యాంగ వ్యవస్థ దేశ ప్రజల్ని ప్రపంచంలో ముందుండే విధంగా నడిపిస్తుందని బీజేపీ సీనియర్ నేత రాం మాధవ్ వ్యాఖ్యానించారు. శనివారం ‘బికాస్ ఇండియా కమ్స్ ఫస్ట్’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ రాజ్యాంగ వ్యవస్థలను విచ్ఛిన్నం చేస్తే ప్రజాస్వామ్యం బలహీనమవుతుంది. రాజ్యాంగానికి విరుద్ధంగా కొంత మంది రైతులు, నాయకులు వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదు. ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలపై రైతులు ప్రభుత్వంతో చర్చించాలి.
కొద్దిమంది నియంత్రణలో నుంచి రైతులను బయటకు తీసుకు వచ్చేందుకే వ్యవసాయ సంస్కరణలు తీసుకొచ్చాం. ఏం జరిగినా రాజ్యాంగపరమైన వ్యవస్థల ద్వారా జరగాలి. రాష్ట్రాల్లో దేవాలయాలపై జరుగుతున్న దాడుల అంశం మా దృష్టికి వచ్చింది. దేవాలయాలపై దాడులు అంశాన్ని ఓ పార్టీపై మరొక పార్టీ నెట్టుకోవడం సరికాదు. దేవాలయాలపై దాడులు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని అన్నారు.