Manam Mana Amaravati Padayatra: బీజేపీ నేతల్ని దొంగలన్న రైతు

30 Jul, 2022 08:59 IST|Sakshi
సోము వీర్రాజును ప్రశ్నిస్తున్న పెనుమాక రైతు

గుంటూరు జిల్లాలో ఘటన 

తాడేపల్లి రూరల్‌: అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లో ‘మనం–మన అమరావతి’ పేరుతో వారం రోజులపాటు బీజేపీ తలపెట్టిన పాదయాత్రను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు శుక్రవారం ప్రారంభించారు. ఉండవల్లి సెంటర్‌ నాలుగు రోడ్ల కూడలిలో ప్రారంభమైన ఈ పాదయాత్ర ఉండవల్లి మీదుగా పెనుమాకకు చేరుకుంది. పెనుమాకలో సోము వీర్రాజుకు తారసపడిన ఓ రైతు ‘మీరు దొంగలు’ అంటూ నిందించాడు. ‘మీ వల్లే రాజధాని రైతులు ఇబ్బందులకు గురి అవుతున్నారు’ అని మండి పడటంతో సోము వీర్రాజు కొంత అసహనానికి గురయ్యారు.

మరో రైతు కలగజేసుకుని అమరావతి విషయంపై ప్రశ్నించారు. అతడికి సోము వీర్రాజు బదులిస్తూ.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజధాని నిర్మాణం సకాలంలో పూర్తి చేయకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు వచ్చాయన్నారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావడానికి సూత్రధారి చంద్రబాబేనని, కేంద్రం ఇచ్చిన నిధులను చంద్రబాబు సరిగా ఖర్చుపెట్టి ఉంటే రైతులకు ఈ ఇబ్బందులు వచ్చేవి కాదన్నారు. బీజేపీ ఒకే రాజధానికి కట్టుబడి ఉందని, రాజధాని నిర్మాణానికి రూ.6 వేల కోట్ల నిధులు కేటాయించడంతో పాటు అమరావతి స్మా›ర్ట్‌ సిటీ ఏర్పాటుకు రూ.2,500 కోట్ల నిధులు కేటాయించిందని తెలిపారు. చంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్లలో రైతులను మోసం చేశాడని ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వస్తే ఏడాదిన్నరలోనే రైతులకు ప్లాట్లు కేటాయించి రాజధానిని అభివృద్ధి చేస్తామని వీర్రాజు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: AP: రెచ్చిపోతున్న రికవరీ ఏజెంట్లు.. మంత్రి కాకాణి పీఏ శంకర్‌కు వార్నింగ్‌ 

మరిన్ని వార్తలు