నెల్లూరు చెరువులో పడవ బోల్తా..అయిదుగురి మృతదేహాలు లభ్యం

27 Feb, 2023 11:49 IST|Sakshi

సాక్షి, నెల్లూరు: పొదలకూరు మండలం తోడేరు చెరువులో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన ఆరుగురిలో అయిదు మృతదేహాలను రెస్క్యూ టీం  వెలికి తీసింది. మృతులు బాలాజీ, చల్లా ప్రశాంత్‌, కళ్యాణ్‌, త్రినాథ్‌, రఘుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. మరో వ్యక్తి సురేంద్ర ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.

మంత్రి కాకాణి ,ఎస్పీ విజయరావు, కలెక్టర్ చక్రధర్ బాబు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న జడ్పీ చైర్పెర్సన్ ఆనం అరుణమ్మ.. మృతుల కుటుంబసభ్యులను పరామర్శించారు. కాగా జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. పొదలకూరు మండలం తోడేరు గ్రామ చెరువులో ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది.

ఈ ఘటనలో ఆరుగురు యువకులు గల్లంతయ్యారు. వాళ్ల ఆచూకీ కోసం పోలీసులు, ఫైర్‌ సిబ్బంది గాలిస్తున్నారు. సెలవు దినం కావడంతో వాళ్లంతా సరదాగా షికారుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రమాదం సమయంలో పడవలో పది మంది యువకులు ఉన్నారు. నలుగురు క్షేమంగా బయటపడ్డారు. ఆరుగురు గల్లంతయ్యారు.  గల్లంతయిన యువకుల పేర్లు.. సురేంద్ర,(19), రఘు (24), బాలాజీ (21), త్రినాథ్ (18), కళ్యాణ్(28), ప్రశాంత్(29)గా నిర్ధారించారు పోలీసులు.  పొదలకూరు సీఐ సంగమేశ్వరరావు, ఎస్ఐ కరిముల్లా  పర్యవేక్షణలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

(చదవండి: నెల్లూరులో ఘోర ప్రమాదం: తోడేరు చెరువులో పడవ బోల్తా.. ఆరుగురు యువకుల గల్లంతు)

మరిన్ని వార్తలు