‘కేంద్రం సూచన మేరకే ఆస్తి పన్నులో మార్పులు’

25 Nov, 2020 15:46 IST|Sakshi
మంత్రి బొత్స సత్యనారాయణ

సాక్షి, తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్‌లో ఆస్తి పన్ను చట్టాన్ని సవరిస్తూ తెచ్చిన ఉత్తర్వులపై కొన్ని పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మున్సిపల్‌శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. కొత్త ఆస్తి పన్ను విధానంపై ఆస్తి పన్ను మోత అంటూ పిచ్చి రాతలు రాస్తున్నారని విమర్శించారు. కేవలం ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయడానికే ఆ పత్రికలు నిర్ణయించుకున్నాయన్నారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న విషయం అందరికి తెలుసని అన్నారు. అలాంటి ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెడుతుందా అని ప్రశ్నించారు. ఆస్తి పన్ను సవరిస్తూ జారీ చేసిన జీవో అర్థం కాకపోతే తమను అడగాలని, దాని గురించి వివరంగా చెప్తామని సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాటగా కోరుతున్నామని, ఇలాంటి తప్పుడు రాతలను విశ్వసించవద్దని ప్రజలను కోరారు. చదవండి: పదేళ్లలో రూ. వెయ్యి కోట్లు చెల్లిస్తాం : సీఎం జగన్‌

ఈ ప్రభుత్వం ప్రజలదని, దేశం మొత్తం కేంద్రం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుందన్నారు. స్థానిక సంస్థలు బలోపేతానికి, మెరుగైన సేవల కోసం తీసుకున్న నిర్ణయాలు ఇవని స్పష్టం చేశారు. ఇంటి పన్ను, ఆస్తి పన్ను విషయంలో కేంద్రం సూచన మేరకు మార్పులు చేశామని పేర్కొన్నారు. ఒక్క ఏపీ రాష్ట్రమే కాకుండా అన్ని రాష్ట్రాలు కూడా ఇదే అవలంబిస్తున్నాయని తెలిపారు. 0.10 శాతం మేర పన్ను వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు, అన్ని విధాలా ఆలోచన చేసి సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. విధానం మార్పుచేయండి, కానీ ప్రజలపై భారం పడకూడదు అని సీఎం చెప్పినట్లు మంత్రి తెలిపారు. ఇంటికి ఉన్న పన్నుకు 10 నుంచి 15 శాతం కంటే ఎక్కువ పెరిగే అవకాశం లేదని అన్నారు. రాష్ట్రంలో 375 చదరపు అడుగుల లోపు ఉన్న వారికి 50 రూపాయలు మాత్రమే పన్ను ఉంటుందని, మిగతా వారికి 0.10 శాతం నుంచి 0.50 వరకు పన్ను ఉంటుందన్నారు. చదవండి: ఏపీ హైకోర్టు గ్యాగ్‌ ఆర్డర్‌పై సుప్రీంకోర్టు స్టే

గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను పరిశీలించాం. దానికీ భారీగా పెరగకుండా 100 నుంచి 350 రూపాయల కంటే నీటి పన్ను ఎక్కువ ఉండకూడదని నిర్ణయించాం. ఇది కూడా 5 శాతం కంటే పెంచకూడదని నిర్ణయించాం. సీవరేజ్ కూడా 30 నుంచి 35 రూపాయలు మించకూడదని నిర్ణయించాం. అందరికీ అందుబాటులో ఉండేలా ఈ నిర్ణయాలు తీసుకున్నాం. సామాన్యులకు, మధ్యతరగతి వారికి ఈ ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రజలకు ఇబ్బంది లేకుండా స్థానిక సంస్థల బలోపేతమే మా ధ్యేయం. ఓ పత్రిక ఇసుక మీద కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చామంటూ రాతలు రాశారని, ఏదైనా ప్రజలకు ఇసుక అందుబాటులో ఉండాలనేది తమ ప్రయత్నం. కొత్త వ్యవస్థను రూపొందించి అవినీతి జరగకుండా చేయాలని ప్రయత్నిస్తున్నాం. మన ఊరిని మనమే అభివృద్ధి చేసుకుందుకు ప్రజలందరి సహకారం అవసరం. చదవండి: పట్టణాల్లో పన్ను రేట్ల హేతుబద్ధీకరణ 

గ్యాగ్ ఆర్డర్ తప్పు అని ఆ రోజే మేము చెప్పాం. ఈ అదే విషయం సుప్రీం కోర్టు చెప్పింది. న్యాయం అనేది అందరికీ సమానమే. దానికి అందరం కట్టుబడి ఉన్నాం. మేము ఊహించిందే. ఆరోజు అందరూ వ్యతిరేకించారు. చంద్రబాబుకి మేము ఎందుకు భయపడతాం. ఎస్టీలు ఒడిస్తారా...? మీ లాగా కులాల మధ్య చిచ్చు పెట్టామా..? బలహీన వర్గాలకు మహిళలకు మేము ఎంతో చేస్తున్నాం. నువ్వు మహిళల్ని మోసం చేస్తే మేము వారిని ఆదుకున్నాం. వారంతా ఆనందంగా ఉన్నారు. ఈ ఒక్క రోజే సుమారు 10 లక్షల మందికి వడ్డీ లేని రుణాలు అందించాం. మళ్లీ రెండో దఫా కరోనా వచ్చే అవకాశం ఉందని ప్రజల క్షేమం కోసం ఎన్నికలు వాయిదా వేయాలన్నాం. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి’ అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

మరిన్ని వార్తలు