నాడు – నేడు రెండో దశ పనులు ప్రారంభించండి

3 Jun, 2022 06:12 IST|Sakshi

పాఠశాలల్లో మార్పు స్పష్టంగా కనిపించాలి

అధికారులకు మంత్రి బొత్స ఆదేశం

కలెక్టర్లు, డీఈవోలతో వీడియో కాన్ఫరెన్స్‌

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన బడి నాడు–నేడు రెండో దశ పనులను వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి  బొత్స సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. నిర్ణీత కాలపరిమితిలో ఈ పనులన్నీ పూర్తయ్యేలా జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు పూర్తి సమన్వయంతో పని చేయాలన్నారు.

పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్‌తో కలిసి విజయవాడలోని సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయం నుంచి గురువారం జిల్లా కలెక్టర్లు, జేసీలు, జిల్లా విద్యాశాఖాధికారులు, సమగ్ర శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు కో–ఆర్డినేటర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మంత్రి బొత్స మాట్లాడుతూ నాడు నేడు రెండో దశలో భాగంగా 12 వేల పైచిలుకు పాఠశాలల్లో పనులు చేపట్టనున్నామని,  ఇప్పటికే రివాల్వింగ్‌ ఫండ్‌  విడుదలైనందున వెంటనే పనులను ప్రారంభించాలని  ఆదేశించారు.

పనుల నాణ్యతలో ఏమాత్రం రాజీ పడొద్దని, పనులు వేగవంతంగా జరగడంలో అధికారులు, ఆయా పాఠశాలల పేరెంట్స్‌ కమిటీలు పూర్తి సమన్వయంతో పనిచేయాలని మంత్రి పేర్కొన్నారు. పాఠశాలల్లో గతానికి ఇప్పటికీ స్పష్టమైన మార్పు కనిపించాలన్నారు. క్షేత్ర స్థాయిలో సమస్యలు ఎదురైతే వెంటనే ఉన్నతస్థాయి అధికారుల దృష్టికి తీసుకురావాలని  మంత్రి సూచించారు.   

మరిన్ని వార్తలు