సీఎం ఎక్కడినుంచైనా పాలన చేయొచ్చు: బొత్స

3 Jun, 2021 13:23 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: రాష్ట్రలో అన్ని ప్రాంతాలు సమగ్రాభివృద్ధి చెందాలన్నదే తమ విధానమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. మూడు రాజధానులపై అసెంబ్లీలో చట్టం చేశామని చెప్పారు. కొందరు కావాలనే కోర్టులకు వెళ్లి ఆలస్యం చేశారని అన్నారు. అడ్డంకులను అధిగమించి త్వరలోనే అభివృద్ధిపథంలోకి తీసుకెళ్తామని చెప్పారు.  న్యాయస్థానాల్లో అడ్డంకులను త్వరలోనే అధిగమిస్తామని తెలిపారు. సీఎం ఎక్కడినుంచైనా పాలన చేయొచ్చని పేర్కొన్నారు. రాజ్యాంగం, చట్టాన్ని గౌరవిస్తూ ముందుకెళ్తామని బొత్స తెలిపారు. 

పేదలకు ఈ రోజు ఒక శుభదినమని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందరికీ ఇల్లుండాలనే సంకల్పంతో ముందుకు వెళ్లుతున్నారని తెలిపారు. 15లక్షల ఇళ్ల నిర్మాణాలకు ఈ రోజు శ్రీకారం చుట్టారని చెప్పారు. అవి లే అవుట్లు కాదని, గ్రామాలు, పట్టణాలుగా మారుతున్నాయని చెప్పారు. వైఎస్సార్ తర్వాత సీఎం జగన్‌ పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం చేపట్టారని గుర్తుచేశారు. కాలనీలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు సమకూరుస్తున్నారని చెప్పారు. కావాల్సిన మెటీరియల్ తక్కువ ధరకు తాము సమకూరుస్తున్నామని చెప్పారు. 

విశాఖపట్నం పరిపాలన రాజధాని విషయంలో ఎందుకు సందేహాలు వస్తున్నాయని అన్నారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే తమ పార్టీ, సీఎం వైఎస్‌ జగన్‌ సంకల్పం అని గుర్తుచేశారు. దాని కోసం చట్టం కూడా చేశామని, కొంత మంది దుష్టశక్తులు అడ్డుకుంటున్నాని మండిపడ్డారు. ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని, విశాఖ పరిపాలన రాజధానిగా తాము ఏదైతే చెప్పామో అది జరిగి తీరుతుందని స్పష్టం చేశారు. 
చదవండి: దేశ చరిత్రలోనే ప్రథమం.. కొత్త చరిత్రకు సీఎం జగన్‌ శ్రీకారం

>
మరిన్ని వార్తలు