విషాదం: వద్దురా తమ్ముడు అంటే వినలేదు.. కళ్లముందే ఘోరం..

4 Nov, 2021 15:51 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

బావిలో దిగిన తమ్ముడు మృతి

గొల్లపేటలో విషాదం 

రణస్థలం: బావిలో స్నానం చేస్తున్న అన్నయ్యను చూసి తాను కూడా బావిలో దిగాలని ప్రయత్నించాడు. ప్రమాదమని అన్నయ్య వారించినా వినలేదు. ఈత రాకపోవడంతో చెట్టుకు చీర కట్టి మరీ బావిలోకి దిగాడు. కొద్ది సమయానికే చీర తెగిపోవడంతో అన్నయ్య కళ్లముందే మునిగిపోయి మృత్యువాతపడ్డాడు. ఈ విషాద ఘటన రణస్థలం మండలం జె.ఆర్‌.పురం పంచాయతీ గొల్లపేటలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గండమాని లోకేష్‌(13) అన్నయ్య పవన్‌తో కలిసి  గ్రామ సమీపంలోని చెరువు పక్కనే ఉన్న బావి వద్దకు వెళ్లారు.

పవన్‌కు ఈత రావడంతో బావిలో దిగి స్నానం చేస్తున్నాడు.  తమ్ముడు లోకేష్‌ కూడా స్నానం చేసేందుకు ప్రయత్నించాడు. అన్నయ్య వద్దని చెప్పిన వినకుండా బావి పక్కనే ఉన్న చిన్న చెట్టుకు చీర కట్టి దిగాడు. కొద్దిసేపటికే చీర తెగిపోవడంతో లోకేష్‌ మునిగిపోయాడు. తమ్ముడు బావిలో మునిగిపోతున్నాడని పవన్‌ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి బయటకు తీసి 108కి ఫోన్‌ చేశారు. వారు వచ్చేటప్పటికే లోకేష్‌ మృతిచెందాడు. తల్లిదండ్రులు సత్యవతి, సోములు కూలి పనులు చేసుకుంటూ కుమారులతో పాటు కుమార్తెను చదివిస్తున్నారు. లోకేష్‌ చనిపోవడంతో తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. దీనిపై ఎటువంటి ఫిర్యాదు రాలేదని జె.ఆర్‌.పురం ఎస్సై జి.రాజేష్‌ తెలిపారు.  
(చదవండి: బీటెక్‌ విద్యార్థిని అనుమానాస్పద మృతి)

మరిన్ని వార్తలు