మోసం చేశాడని కేసు పెట్టి జైలుకు పంపి.. పెళ్లి చేసుకుంటుంటే పెట్రోల్‌తో వచ్చి..

4 Dec, 2022 13:50 IST|Sakshi
శ్రీనివాస కల్యాణ మండపంలో జరుగుతున్న వివాహ సమయంలో జరుగుతున్న రగడ

సాక్షి, విశాఖపట్నం: ఓ యువతి తనను మోసం చేశాడని ప్రేమికుడిపై కేసు పెట్టి జైలుకు పంపింది. జైలు నుంచి విడుదలైన యువకుడు మరో పెళ్లి చేసుకుంటుంటే అదే యువతి కల్యాణ మండపానికి వచ్చి పెట్రోల్‌ బాటిల్‌తో రచ్చచేసింది. విషయం గాజువాక పోలీసులకు చేరడంతో వారు వచ్చి యువతి బంధువులకు నచ్చజెప్పారు. కోర్టు వివాదంలో ఉన్న అంశాన్ని కోర్టులో తేల్చుకోవాని సూచించారు.  

యువతి బంధువులకు నచ్చచెబుతున్న గాజువాక సీఐ భాస్కరరావు 

జీవీఎంసీ 69వ వార్డు తుంగ్లాం గ్రామానికి చెందిన ఎం. విజయ్‌ భగత్‌ ఓ ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతను పార్వతీపురానికి చెందిన డి. ప్రియాంక అనే యువతిని ప్రేమించి కొంత కాలం తర్వాత వదిలేశాడు. దీంతో ఆమె విజయ్‌భగత్‌ మోసం చేశాడని మే నెలలో కేసు పెట్టడంతో యువకునికి జైలు శిక్ష పడింది.

జైలు నుంచి వచ్చిన విజయ్‌ భగత్‌ మరో సంబంధం చూసుకొని శనివారం నాతయ్యపాలెంలోని కల్యాణ మండపంలో వివాహం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న ప్రియాంక తన బంధువులు, స్నేహితులతో కల్యాణ మండపానికి చేరుకొని పెట్రోల్‌ బాటిల్‌తో బెదిరింపులకు దిగింది. సమాచారం అందుకున్న గాజువాక సీఐ ఎల్‌.భాస్కరరావు, ఎస్‌ఐ కొల్లి సతీష్‌ వచ్చి కోర్టు పరిధిలో ఉన్న అంశంలో ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని యువతితో పాటు బంధువులకు సూచించారు.   

చదవండి: (విశాఖ.. ఎగుమతులకు స్వర్గధామం)

మరిన్ని వార్తలు