జల్సాల కోసం అక్క ఇంటికే కన్నం

2 Mar, 2023 14:02 IST|Sakshi

అన్నమయ్య : జల్సాల కోసం అక్క ఇంటికే కన్నం వేసి దోచుకున్న వ్యక్తిని అరెస్ట్‌ చేసి, బంగారు నగలు స్వాధీనం చేసుకున్నామని ఎస్‌ఐ కే.రామమోహన్‌ బుధవారం మీడియాకు తెలిపారు. ఆయన కథనం మేరకు వివరాలు..బి.కొత్తకోట నగర పంచాయతీ తాకాటంవారిపల్లెకు చెందిన డి.ఓబులేసు (28) మద్యం, జల్సాలకు అలవాటు పడ్డాడు. ఓబులేసుకు కూలీపనితో సంపాదించే డబ్బు సరిపోకపోవడంతో దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఓబులేసు అక్క ఉత్తమ్మ తాకాటంవారిపల్లెలోని ఇంటిలో ఉంటోంది.

ఆమెకు బి.కొత్తకోటలోనూ ఇల్లు ఉంది. గతనెల 11న తాకాటంవారిపల్లెలోని ఇంటికి తాళంవేసి బి.కొత్తకొటకు వచ్చింది, పది రోజుల తర్వా తిరిగి తాకాటంవారిపల్లెకు వెళ్లింది. తాళం తీసి లోపలికి వెళ్లింది. బీరువా పగులగొట్టి ఉండటం గమనించింది. వెంటనే బీరువాలో చూడగా గలు చోరీకి గురైనట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు చేధించేందుకు పోలీసులు బెంగళూరు, మైసూర్‌లో దర్యాప్తు చేశారు. పలువురి అదుపులోకి తీసుకుని విచారించారు. అయినా నిందితులు ఎవరో తేలకపోవడంతో స్థానికులపై అనుమానంతో నిఘా వేసి దర్పాప్తు ప్రారంభించడంతో బుధవారం నిందితుడు ఓబులేసు బత్తలాపురం క్రాస్‌ వద్ద ఉన్నట్టు గుర్తించి అరెస్ట్‌ చేశారు.

చోరీపై విచారించగా ఉత్తమ్మ ఇంటికి కన్నంవేసింది సొంత తమ్ముడు ఓబులేసు అని నిర్ధారణ అయింది. గతనెల 11వ తేది రాత్రి 11 గంటల సమయంలో అక్క ఉత్తమ్మ ఇంటి తాళాలు తీసి లోపలికి ప్రవేశించి బీరువాలోని నగలను చోరీ చేసినట్టు నిర్ధారించారు. నిందితుని నుంచి రూ.1.24 లక్షల విలువైన ఒక నక్లెస్‌, జత కమ్మలు, జత జాలర్లులను స్వాధీనం చేసుకుని నిందితున్ని అరెస్ట్‌ చేశామని తెలిపారు. నిందితుడిని మదనపల్లె కోర్టుకు తరలించినట్టు ఎస్‌ఐ చెప్పారు.

మరిన్ని వార్తలు