62.79 లక్షల మందికి పింఛన్లు

1 Aug, 2022 04:22 IST|Sakshi

పెన్షన్‌ పంపిణీకి రూ.1,596.77 కోట్లు విడుదల

కొత్తగా 3.10 లక్షల మంది లబ్ధిదారులు

ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు వెల్లడి

సాక్షి, అమరావతి/దేవరాపల్లి: రాష్ట్ర వ్యాప్తంగా 62,79,486 మంది లబ్ధిదారులకు ఆగస్టు 1వ తేదీ నుంచి వైఎస్సార్‌ పింఛన్‌ కానుక కింద డబ్బులు పంపిణీ చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్టు ఉప ముఖ్యమంత్రి (పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ) బూడి ముత్యాలనాయుడు తెలిపారు. ఇందుకోసం రూ.1,596.77 కోట్లు ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసిందన్నారు. కొత్తగా 3.10 లక్షల మందికి పింఛన్‌ సొమ్మును అందజేస్తున్నామని చెప్పారు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం తారువలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.

రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం తెల్లవారుజాము నుంచి లబ్ధిదారులకు పింఛన్లు అందజేయడానికి 2.66 లక్షల మంది వలంటీర్లు సిద్ధంగా ఉన్నారన్నారు. ఐదు రోజుల్లోగా పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించామని తెలిపారు. లబ్ధిదార్లకు పింఛన్లు అందజేసే సమయంలో గుర్తింపు కోసం బయోమెట్రిక్, ఐరిస్‌ విధానాలను అమలు చేస్తున్నామని, ఆర్‌బీఐఎస్‌ (రియల్‌ టైమ్‌ బెనిఫిషరీష్‌ ఐడెంటిఫికేషన్‌ సిస్టమ్‌) విధానాన్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. సాంకేతిక కారణాలతో ఏ ఒక్కరికీ పింఛన్‌ అందలేదన్న ఫిర్యాదు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాలోని డీఆర్‌డీఏ కార్యాలయాల్లోని కాల్‌ సెంటర్ల ద్వారా పింఛన్ల పంపిణీని పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు విజయవాడలో ఓ ప్రకటన కూడా విడుదల చేశారు.

మరిన్ని వార్తలు