పోలవరం ప్రాజెక్ట్‌పై అన్ని విషయాలు వివరించా

6 Nov, 2020 18:11 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పోలవరం అంచనాలకు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటుందని ఆశిస్తున్నామని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఆయన శుక్రవారం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. పోలవరం నిధులు, సవరించిన అంచనాల ఆమోదం, ఆర్ధిక సాయంపై చర్చించారు. భేటీ అనంతరం మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ మాట్లాడుతూ.. ‘పోలవరం ప్రాజెక్టు సంబంధించిన అన్ని విషయాలు వివరించా. సవరించిన అంచనాలకు ఆమోదం తెలిపే పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. పోలవరం అంచనాలకు కేంద్రం ఒప్పుకుంటుం దని ఆశిస్తున్నాం. (చదవండి : అర్ధరాత్రి ఒప్పందంతో చంద్రబాబు ద్రోహం)

ప్రాజెక్టు కోసం రాష్ట్రం ఖర్చు చేసిన 4 వేల కోట్లలో 2,234 కోట్లకు ఇటీవల కేంద్రం అనుమతి ఇచ్చింది. 2013-14 అంచనాలకు టీడీపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. కానీ నాటి అంచనాల కంటే భూసేకరణకే 17 వేల కోట్లు అదనం ఖర్చు అవుతుంది. భూసేకరణలో 2005-2006 అంచనాలనే 2013-14 అంచనాల్లో పొందుపరిచారు. 2013-14 అంచనాల ప్రకారం  అయితే ఇబ్బంది అవుతుందని కేంద్రమంత్రికి చెప్పాం. సవరించిన అంచనాలు- 1, 2, సహా సవరించిన అంచనా కమిటీ నివేదికలు కేంద్రానికి ఇచ్చాం. వాటిని సమీక్షించి నిధులు మంజూరు చేయాలని కోరాం.

రాష్ట్రం మొత్తం 12 వేల కోట్లు ఖర్చు పెడితే 8 వేల కోట్లు ఇచ్చారు. 4 వేల కోట్లు రావాల్సి ఉంది. అందులో కూడా రూ. 2,234 కోట్లకు మంజురు లభించింది. 2014లో కేంద్రమే ప్రాజెక్టు  పునరావాసంలో ఖర్చు పెరిగే అవకాశం ఉందని తీర్మానం చేసింది. ఆ నిధులు కూడా కేంద్రమే భరించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేసినా తీర్మానాన్ని కుడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పట్టించుకోలేదు. నాటి చంద్రబాబు ప్రభుత్వం 2013-14 అంచనాలకే ఒప్పందం చేసుకోవడం అతిపెద్ద తప్పు. రాష్ట్ర ప్రభుత్వమే ప్రాజెక్టు నిర్మాణం చేస్తోంది. నిర్మాణం పురోగతిలోనే ఉంది’ అని తెలిపారు.

మరిన్ని వార్తలు