బ్యాంకులు మరింత తోడ్పడాలి

23 Mar, 2021 05:45 IST|Sakshi

అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఇంకా సహకారమందించాలి 

కౌలు రైతులకు రుణాల విషయంలోనూ ప్రగతి కనబర్చాలి  

ఉచిత పంటల బీమా కింద 50 లక్షల మంది రైతులకు దన్నుగా నిలవండి 

130 శాతం క్రెడిట్‌ నిష్పత్తిపై బ్యాంకర్లకు ప్రత్యేక అభినందనలు 

రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ఆర్థికమంత్రి బుగ్గన 

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు బ్యాంకులు మరింత తోడ్పాటును అందించాల్సిందిగా రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ విజ్ఞప్తి చేశారు. సచివాలయంలో సోమవారం మంత్రి నేతృత్వంలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోవిడ్‌ వంటి ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అనేక పథకాలను నిరంతరాయంగా అమలుచేస్తోందన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. 

► వైఎస్సార్‌ సున్నా వడ్డీ, వైఎస్సార్‌ చేయూత, జగనన్న తోడు, వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా, అందరికీ ఇళ్లు, టిడ్కో గృహాలు వంటి పథకాలకు బ్యాంకులు మరింతగా సహకరించాలి. 
► రైతుల దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సీఎం వైఎస్‌ జగన్‌ అనేక విప్లవాత్మకమైన కార్యక్రమాలను చేపట్టారు. వాటితోపాటు కౌలు రైతులందరికీ అవసరమైన మేర రుణాలు అందించాలి. 
► రాష్ట్రంలో 130 శాతం క్రెడిట్‌ డిపాజిట్‌ నిష్పత్తిని నిర్వహిస్తున్నందుకు ప్రభుత్వం తరఫున బ్యాంకర్లందరికీ ప్రత్యేకంగా అభినందనలు. 
► వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం కింద సుమారు 50 లక్షల మందికి బీమాను కలి్పంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనికీ బ్యాంకులు సహకరించాలి.  
► పెండింగ్‌లో ఉన్న ‘జగనన్న తోడు’ దరఖాస్తుదారులందరికీ త్వరితగతిన సాయం చేయాలి.  
► ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర వర్గాలకిచ్చే రుణాల వాటాలో మెరుగైన ప్రగతి కనబర్చాలి.  
► స్వయం సహాయక సంఘాలకిచ్చే రుణాలపై వడ్డీ విషయంలో అన్ని బ్యాంకులు ఒకే విధమైన విధానాన్ని పాటించాలి.  

కౌలు రైతులకు మరిన్ని రుణాలివ్వండి..
వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. కౌలు రైతులకు రుణాలు మంజూరులో మెరుగైన ఫలితాలు సాధించకపోవడంపై గత డిసెంబర్‌లో సీఎం అసంతృప్తి వ్యక్తంచేసిన విషయాన్ని గుర్తుచేశారు. వచ్చే ఆరి్థక సంవత్సరంలోనైనా వీరికి మెరుగైన రీతిలో రుణాలివ్వాలని కోరారు. వ్యవసాయానుబంధ రంగాల రైతులకూ సాయం చేయాలన్నారు. రైతుభరోసా కేంద్రాలను బలోపేతం చేసేందుకు బ్యాంకులు అన్నివిధాలా తోడ్పడాలని మంత్రి కన్నబాబు కోరారు.  

ఏపీలోనే అత్యధిక కౌలు రైతులకు రుణాలు 
నాబార్డు సీజీఎం సుదీర్‌ జన్నావర్‌ మాట్లాడుతూ.. దేశంలో అత్యధిక కౌలు రైతులకు రుణాలందిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశేనన్నారు. అన్ని బ్యాంకులు మెరుగైన లక్ష్యాలు సాధించడాన్ని ఆయన కొనియాడారు. ఆర్బీఐ జీఎం సుందరం శంకర్‌ మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో క్రెడిట్‌ రేట్‌ 6.2 శాతంగా ఉండగా ఏపీలో 15.92 శాతంగా ఉండడం అభినందనీయమన్నారు. చివరి త్రైమాసికంలో కూడా బ్యాంకులు తమ లక్ష్యాలను అధిగమించాలని ఆకాంక్షించారు. ఆత్మ నిర్భర్‌ భారత్‌ కార్యక్రమం కింద ఆక్వా రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దఎత్తున అవకాశాలున్నాయని అందుకు బ్యాంకులు సహకారం అందించేందుకు ముందుకు రావాలని యుబీఐ సీజీఎం లాల్‌సింగ్‌ కోరారు. అంతకుముందు.. ఎస్‌ఎల్‌బీసీ కనీ్వనర్, యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా జీఎం బ్రహ్మానందరెడ్డి సమావేశానికి స్వాగతం పలికి అజెండాను వివరించారు.   

>
మరిన్ని వార్తలు