Visakhapatnam Sai Priya Case: సాయిప్రియ కేసులో మరో ట్విస్ట్.. తండ్రిపై కూడా

30 Aug, 2022 12:11 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: గత నెల 25న భర్తను ఏమార్చి ప్రియుడితో వెళ్లిపోయిన సాయిప్రియ ఉదంతంలో ఆమె తండ్రి రాపిరెడ్డి అప్పలరాజుపై 3వ పట్టణ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. గత జులై 25న పెళ్లి రోజు నేపథ్యంలో భర్త శ్రీనివాస్‌తో కలిసి సాయిప్రియ ఆర్కేబీచ్‌కు విహారానికి వచ్చిన విషయం తెలిసిందే. ఆ రోజు భర్త ఏమరపాటుగా వున్న సమయంలో ముందస్తు ప్రణాళికతో సాయిప్రియ తన ప్రియుడు రవితేజతో పరారైంది. 

అయితే ఈ ఘటనలో సాయిప్రియ బీచ్‌లో గల్లంతైనట్లు ఆమె తండ్రి రాపిరెడ్డి అప్పలరాజు 3వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన జిల్లా యత్రాంగం, పోలీసులు పెద్ద ఎత్తున బీచ్‌లో గాలింపు చర్యలు చేపట్టారు. ఇందుకోసం భారీగా ప్రభుత్వ వనరులను వినియోగించిన విషయం తెలిసిందే.

అయితే సాయిప్రియకు గతంలో రవితేజ అనే యువకుడితో ప్రేమాయనం ఉన్నట్లు ఆమె తండ్రికి ముందే తెలిసినా పోలీసులకు సమాచారం ఇవ్వకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగా పోలీసులను, జిల్లా యంత్రాంగాన్ని తప్పుదోవ పట్టించడంపై అతనిపై కేసు నమోదు చేసినట్లు త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐ రామారావు వెల్లడించారు.    

చదవండి: (ఆర్కే బీచ్‌లో అదృశ్యమైన సాయిప్రియ కేసులో మరో ట్విస్ట్‌)

మరిన్ని వార్తలు