ఉద్యోగం పేరిట మోసం.. 12 కోట్లు వసూలు

14 Sep, 2020 14:44 IST|Sakshi

మహారాణి పేట పీఎస్‌లో కేసు నమోదు

సాక్షి, విశాఖపట్నం : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన దళిత యువకుడు పర్రి శ్రీకాంత్ శిరోముండనం ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పరాన్నజీవి దర్శకుడు నూతన్‌ నాయుడు బాగోతాలు ఒక్కొక్కటీ బయపడుతున్నాయి. అతనిపై ఇప్పటికే పలు కేసులు బయటపడగా.. తాజాగా మరో మోసం వెలుగుచూసింది. ఉద్యోగం పేరిట నూతన్‌నాయుడు 12 కోట్ల రూపాయలను వసూలు చేశాడని ఆరోపిస్తూ మహారాణి పేట పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎస్‌బీఐలో రీజినల్‌ డైరెక్టర్‌ ఉద్యోగం ఇప్పిస్తానని తన నుంచి 12 కోట్లు వసూలు చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన విశాఖ డీసీపీ ఐశ్వర్య రస్తోగి ఫిర్యాదుపై లోతైన విచారణ జరుపుతామన్నారు. అవసరమైతే మరోసారి కస్టడీలోకి తీసుకుంటామని తెలిపారు. కాగా పి.వి.రమేశ్‌ పేరుతో పైరవీలు చేయడంపై కంచరపాలెం, గోపాలపట్నం, గాజువాక పోలీస్‌ స్టేషన్లలోనూ నూతన్‌పై కేసులు నమోదయ్యాయి. (కాల్‌ హిస్టరీ ఆధారంగా నూతన్‌ మోసాలపై దర్యాప్తు)

నూతన్‌నాయుడు ఇంట్లో పనిచేసి మానివేసిన దళిత యువకుడు వర్రి శ్రీకాంత్‌ను సెల్‌ఫోన్‌ పోయిందనే నెపంతో ఇంటికి పిలిపించి శిరోముండనం చేయడంతో పాటు దారుణంగా హింసించిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన 24 గంటల వ్యవధిలోనే నూతన్‌ భార్యతో సహా ఏడుగురిని అరెస్టు చేశారు. శ్రీకాంత్‌పై చేసిన అకృత్యాలను సెల్ఫీలు తీసి పైశాచిక ఆనందం పొందిన నిందితులు అక్కడితో ఆగకుండా వీడియోలు తీశారు. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. (విశాఖ సెంట్రల్‌ జైల్‌కు నూతన్‌ నాయుడు)

మరిన్ని వార్తలు