'ఏపీలో పీడీఎస్ కమాండ్ కంట్రోల్ రూమ్ వ్యవస్థపై కేంద్రం ప్రశంసలు'

2 Mar, 2023 14:50 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఏపీలో పీడీఎస్ కమాండ్ కంట్రోల్ రూమ్ వ్యవస్థను కేంద్రం ప్రశంసించిందని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. జియో ట్యాగ్ సిస్టం ద్వారా ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా చేసినట్లు పేర్కొన్నారు. స్మార్ట్ పీడీఎస్ విధానం అమలు చేస్తున్నట్లు తెలిపారు.

'రైస్ మిల్లులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, బియ్యం రీసైకిల్ కాకుండా చేస్తున్నాం. ధాన్యం కొనుగోలు డబ్బులు మూడు రోజులలో రైతుల ఖాతాలలో వేస్తున్నాం. రూ.1,702 కోట్ల పాత బకాయిలు చెల్లింపునకు కేంద్రం  అంగీకారం తెలిపింది. కేరళ కోసం జయ బొండం బాయిల్డ్ రైస్‌కు  కేంద్రం 5 లక్షల మెట్రిక్ టన్నులు ఆర్డర్ ఇచ్చింది. ఒక లక్ష అంత్యోదయ కార్డుల మంజూరుకు కేంద్రం ఒప్పుకుంది.  

రైతులకు ధాన్యం డబ్బులు ఎప్పటికప్పడు ఇస్తున్నాం. కేంద్రం సకాలంలో చెల్లింపులు చేస్తోంది. రేషన్ కార్డుపై రెండు కిలోల గోధుమ పిండి కూడా ఇస్తున్నాం. వచ్చే రెండు నెలల్లో జొన్నలు, రాగులు కూడా పీడీఎస్ కింద  సరఫరా చేస్తాం. పీడీఎస్ బియ్యం రీసైక్లింగ్ జరగకుండా  దాడులు చేస్తున్నాం. రేషన్ కార్డులు తొలగించం. పార్టీలు, కులాలు చూడకుండా పథకాలు ఇస్తున్నాం.' అని కారుమూరి పేర్కొన్నారు.
చదవండి: ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌పై కేటీఆర్‌ ట్వీట్‌

మరిన్ని వార్తలు