బహ్రెయిన్‌ నుంచి క్షేమంగా తిరిగొస్తున్న వలస కార్మికులు

1 Oct, 2021 05:09 IST|Sakshi

 సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లేఖకు స్పందించిన కేంద్రం 

సాక్షి, అమరావతి: బహ్రెయిన్‌లో ఎన్‌హెచ్‌ఎస్‌ సంస్థలో పనిచేస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్రానికి చెందిన వలస కార్మికులను ప్రభుత్వం క్షేమంగా స్వస్థలాలకు చేరుస్తోంది. ఇప్పటి వరకు 33 మందిని బహ్రెయిన్‌ నుంచి రాష్ట్రానికి తీసుకొచ్చినట్టు ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ ప్రెసిడెంట్‌ వెంకట్‌ ఎస్‌.మేడపాటి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కార్మికులకు భోజనం, వసతి, స్వస్థలాలకు రవాణా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్టు పేర్కొన్నారు.

రానున్న రోజుల్లో మరింత మంది కార్మికులను వెనక్కి తీసుకురానున్నట్టు తెలిపారు. ఎన్‌హెచ్‌ఎస్‌ సంస్థ దాష్టీకాలు భరించలేక ఇబ్బందులు పడుతూ అక్కడ ఇరుక్కుపోయిన కార్మికుల విషయం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి వెళ్లగానే.. ఆయన తక్షణం స్పందించినట్టు తెలిపారు. వారిని క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ సెప్టెంబర్‌ 13న కేంద్ర విదేశాంగ శాఖ మంత్రికి లేఖ రాసినట్టు తెలిపారు. 

దీనిపై విదేశాంగ శాఖ తక్షణం స్పందించడంతో కార్మికులను స్వదేశానికి తీసుకొస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రి సీదిరి అప్పలరాజుకు కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. 

మరిన్ని వార్తలు