స్టీల్‌ ప్లాంట్‌పై పునఃపరిశీలించాలని ఏపీ కోరింది 

21 Jul, 2021 03:59 IST|Sakshi

పార్లమెంట్‌కు తెలిపిన కేంద్రం 

అడాప్ట్‌–ఏ–హెరిటేజ్‌లో ‘గండికోట’ 

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం పలు హామీలను నెరవేర్చామని, మిగిలిన కొన్ని హామీల అమలు వివిధ దశల్లో ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ లోక్‌సభకు తెలిపారు. కొన్ని నిర్మాణ ప్రాజెక్టులు, విద్యాసంస్థల విభజన సంబంధిత అంశాల పరిష్కారానికి పదేళ్ల పాటు గడువు ఉందని చెప్పారు. వీటిపై సంబంధిత శాఖలు, విభాగాలతోపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రతినిధులతో హోంశాఖ ఇప్పటివరకు 25 సమీక్ష సమావేశాలు నిర్వహించిందని చెప్పారు.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో(ఆర్‌ఐఎన్‌ఎల్‌) వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ(సీసీఈఏ) నిర్ణయం తీసుకున్న తరువాత దీన్ని పునఃపరిశీలించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పలుదఫాలు విజ్ఞప్తి చేసిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ప్లాంట్‌కు సంబంధించి అధికంగా ఉన్న భూమి, ఇతర నాన్‌–కోర్‌ ఆస్తులను లావాదేవీల నుంచి వేరు చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ భగవత్‌ కిషన్‌రావ్‌ కరాడ్‌ పేర్కొన్నారు.  ఢిల్లీలో గత మూడు నెలల్లో పెట్రోల్‌ ధర రూ.10.98, డీజిల్‌ రూ.9 పెరిగిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. జూలై 16న ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ రూ.101.54, డీజిల్‌ రూ.89.87 ఉందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్‌ చౌదరి రాజ్యసభకు తెలిపారు. 

‘ఆదర్శ్‌ స్మారక్‌’లో నాగార్జునకొండ, శాలిహుండం  
ఆదర్శ్‌ స్మారక్‌ పథకం కోసం ఆంధ్రప్రదేశ్‌లోని నాగార్జునకొండ, శాలిహుండం బౌద్ధ నిర్మాణాలు, వీరభద్ర దేవాలయాన్ని గుర్తించినట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. ఆదర్శ్‌ స్మారక్‌ పథకంలో భాగంగా ఈ ప్రదేశాల్లో వైఫై, కేఫ్‌టేరియా, ఇంటర్‌ప్రిటేషన్‌ సెంటర్, బ్రెయిలీ గుర్తులు, విద్యుద్దీప కా>ంతులు లాంటి సదుపాయాలు కల్పిస్తున్నట్లు రాజ్యసభకు తెలిపారు. అడాప్ట్‌–ఏ–హెరిటేజ్‌ కింద గండికోటను చేర్చామని, ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 135 నిర్మాణాలు కేంద్ర ప్రభుత్వ పరిరక్షణలో ఉన్నాయని చెప్పారు. 

మరిన్ని వార్తలు