Central Minister Kishan Reddy: 9న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రాక 

30 May, 2022 12:24 IST|Sakshi

ప్రధాని పర్యటన ఏర్పాట్ల పరిశీలన 

సాక్షి, భీమవరం: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వచ్చేనెల 9న భీమవరం రానున్నారని, ఆజాదీకా అమృత ఉత్సవాల్లో భాగంగా అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలకు జూలై 4న ప్రధాని మోదీ ఇక్కడకు రానున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లను పరిశీలించనున్నారని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. ఆదివారం భీమవరంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నార్ని తాతాజీ అధ్యక్షతన జ రిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ప్రభుత్వపరంగా కార్యక్రమం జరుగుతుందన్నారు.

ఆజాదీకా అమృత ఉత్సవాల్లో భాగంగా కేంద్రం పలు కార్యక్రమాలు నిర్వహిస్తోందని, ఇందుకోసం 250 మంది ప్రముఖులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటైందన్నారు. స్వాత్రంత్య సమరయోధుల ప్రాంతాల సందర్శనలో భాగంగా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కృషితో ప్రధాని మోదీ భీమవరం రానున్నారన్నారు. ప్రధాని పర్యటనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తున్నాయని, 3 లక్షల మంది రావచ్చని అంచనా వేస్తున్నారన్నారు. బీజేపీ కిసాన్‌ మోర్చ జిల్లా అధ్యక్షుడు అల్లూరి సా యిదుర్గరాజు, నాయకులు అరసవల్లి సుబ్రహ్మణ్యం, మణికంఠ వెంకటేష్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు