'దొంగలు..' బాబో!

24 Dec, 2020 03:18 IST|Sakshi

పోలవరం పేరుతో రూ.7,153.62 కోట్ల రుణం

నకిలీ కొనుగోళ్లతో రూ.6,202.92 కోట్లు మళ్లింపు

టన్నుల కొద్దీ బరువైన ఇనుము, సిమెంటు, ద్విచక్ర వాహనాలపై తరలించినట్లు నకిలీ రికార్డులు

రూపాయి పెట్టుబడి పెట్టకుండానే భార్య, సమీప బంధువుకు రూ.450 కోట్ల విలువైన షేర్లు బదలాయింపు

బ్యాంకు రుణంలో నేరుగా రూ.350.49 కోట్లు వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లింపు

14 బ్యాంకుల కన్సార్షియానికి బురిడీ

ట్రాన్స్‌ట్రాయ్‌ సిబ్బంది పేరుతో తొమ్మిది నకిలీ సంస్థలు

ఇనుము, ఇసుక లాంటి భారీ మెటీరియల్‌ను తరలించాలంటే పెద్ద వాహనాలు తప్పనిసరి. లారీ, ట్రక్కు లేకపోతే ట్రాక్టర్‌ వంటి వాహనాల్లోనే వాటిని తరలిస్తారు. కానీ పోలవరం లాంటి అతి పెద్ద ప్రాజెక్టు నిర్మాణానికి టన్నుల కొద్దీ ఉక్కును ద్విచక్ర వాహనాలపై  తరలించారంటే అది దోపిడీల్లో నేర్పరులకే సాధ్యం. అసలు కొనుగోలే చేయని సరుకును అధిక ధరలకు కొన్నట్లు చూపించి ఏకంగా రూ.907.10 కోట్లను లూటీ చేయడం రాయపాటికే సాధ్యమైంది. 

స్కూటీలో పోలవరం స్టీల్‌...!!
స్టీల్, ఇసుక లాంటి భారీ మెటీరియల్‌ తరలించాలంటే ఎక్కడైనా డీసీఎం, లారీ లాంటి పెద్ద వాహనాలు తప్పనిసరి. ఓ ఇల్లు కట్టాలన్నా నిర్మాణానికి వాడే బరువైన ఇనుము, ఇతర మెటీరియల్‌ను పెద్ద వాహనంలోనే తరలిస్తారు. పోనీ కనీసం ట్రాక్టరైనా వాడతారు. కానీ పోలవరం లాంటి అతి పెద్ద ప్రాజెక్టు నిర్మాణంలో మాత్రం ద్విచక్ర వాహనాలపై టన్నుల కొద్దీ ఉక్కు తరలించారంటే నమ్మాలి మరి! ఇవే కాదు.. విచిత్రంగా ఇక్కడ ఆటోలు, కార్లలో వందల టన్నుల స్టీల్‌ తరలించినట్లు చూపించారు! సిమెంట్, ఇసుక, స్టీల్‌ తరలించడంలో రాయపాటి స్టైలే వేరు మరి..!! అసలు కొనుగోలే చేయని సరుకును అధిక ధరలకు కొన్నట్లు చూపించి ఏకంగా రూ.907.10 కోట్లను లూటీ చేయడం రాయపాటికి మాత్రమే సాధ్యమైంది. సీబీఐ ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో విస్తుపోయే ఈ అక్రమాల బాగోతం బట్టబయలైంది. 

సాక్షి, హైదరాబాద్‌/సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు సన్నిహితుడైన ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు బ్యాంకులను మోసం చేయడంలో నీరవ్‌ మోడీ, మెహుల్‌ చోక్సీ, విజయ మాల్యాలను తలదన్నాడు. చంద్రబాబుకు మరో సన్నిహితుడైన సుజనా చౌదరి బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగ్గొట్టడంపై సీబీఐ దర్యాప్తు జరుగుతున్న విషయం తెలిసిందే. బ్యాంకులను బురిడీ కొట్టించడంలో వీరిద్దరూ ఆరితేరినట్లు దర్యాప్తులో వెల్లడవుతోంది. 
తిరుచానూరు అమ్మవారికి 8 కిలోల బంగారం, వజ్రాలతో నేసిన చీరను సమర్పిస్తున్న రాయపాటి, చెరుకూరి శ్రీధర్‌(ఫైల్‌) 

ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో...
పోలవరం ప్రాజెక్టు, జాతీయ రహదారుల కాంట్రాక్టు పనుల పేరుతో 14 జాతీయ బ్యాంకుల నుంచి రూ.7,153.62 కోట్ల రుణం తీసుకున్న రాయపాటి తన సంస్థ ‘ట్రాన్స్‌ట్రాయ్‌’లో పనిచేస్తున్న వారి పేర్లతో ఏకంగా తొమ్మిది కంపెనీలను ఏర్పాటు చేసి నకిలీ కొనుగోళ్లతో రూ.6,202.82 కోట్లను మింగేశారు. ఇందులో రూ.350.49 కోట్లను రాయపాటి తన భార్య  లీలాకుమారి, సమీప బంధువు చెరుకూరి శ్రీధర్‌ వ్యక్తిగత ఖాతాల్లోకి నేరుగా మళ్లించి స్వాహా చేయడం ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో బహిర్గతమైందని సీబీఐ తేల్చింది. ట్రాన్స్‌ట్రాయ్‌ తరఫున రాయపాటి సాంబశివరావు, చెరుకూరి శ్రీధర్, అక్కినేని సతీష్, లీలాకుమారి రుణం తీసుకుని చెల్లించకుండా మోసగించడంపై కెనరా బ్యాంక్‌ జనరల్‌ మేనేజర్‌ టి.వీరభద్రారెడ్డి ఈనెల 15న ఇచ్చిన ఫిర్యాదుతో సీబీఐ కేసు నమోదు చేసింది. గుంటూరు, హైదరాబాద్‌లోని రాయపాటి, చెరుకూరి శ్రీధర్, అక్కినేని సతీష్‌ ఇళ్లు, కార్యాలయాలపై  ఈనెల 18న సోదాలు నిర్వహించింది. ఎఫ్‌ఐఆర్‌లో రాయపాటి అక్రమాలను సీబీఐ బట్టబయలు చేసింది. 

సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో ప్రధానాంశాలు ఇవీ..
ప్రణాళికతో బ్యాంకుల దోపిడీ..
రాయపాటి 2001లో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ట్రాయ్‌ ఇండియా లిమిటెడ్‌(టీఐఎల్‌) జాతీయ రహదారులు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం లాంటి కాంట్రాక్టు పనులను చేపడుతోంది. 2013లో పోలవరం హెడ్‌ వర్క్స్‌ నిర్మాణాన్ని ట్రాన్స్‌ట్రాయ్‌ దక్కించుకుంది. కెనరా బ్యాంకు నేతృత్వంలోని 14 బ్యాంకుల కన్సార్షియం ట్రాన్స్‌ట్రాయ్‌కు రూ.9394.28 కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించింది. ఇందులో రూ.7153.62 కోట్ల రుణాన్ని రాయపాటి తీసుకున్నారు. రాయపాటి తన సంస్థలో పనిచేసే వారి పేర్లతో తొమ్మిది నకిలీ కంపెనీలను ఏర్పాటు చేసి వాటి నుంచి ఇనుము, సిమెంటు, కంకర, యంత్రాలు, వాహనాలు, పరికరాలు కొనుగోలు చేయకుండానే కొన్నట్లు చూపించి రూ.7153.62 కోట్లను బ్యాంకుల నుంచి తీసుకున్న రుణం నుంచి చెల్లించేశారు. ఆ తర్వాత ఆ తొమ్మిది సంస్థల నుంచి రూ.6,202.82 కోట్లను ట్రాన్స్‌ట్రాయ్‌ ఖాతాలోకి మళ్లించి స్వాహా చేశారు. 

నకిలీ కొనుగోళ్లు..
ట్రాన్స్‌ట్రాయ్‌లో పనిచేసే సుధాకర్‌బాబు పేరుతో పద్మావతి ఎంటర్‌ప్రైజెస్, మాజీ డైరెక్టర్‌ సాంబశివరావు మలినేని పేరుతో యూనిక్‌ ఇంజనీర్స్, వేములపల్లి హరీష్‌బాబు పేరుతో బాలాజీ ఎంటర్‌ప్రైజస్, కొరివి శివకుమార్‌ పేరుతో రుత్విక్‌ అసోసియేట్స్‌ను ఏర్పాటు చేయించిన రాయపాటి ఆ సంస్థల ఖాతాల్లోకి రూ.686.55 కోట్లను కనీసం జమ  చేయకుండానే అంతే విలువైన వస్తువులను ఆ సంస్థల నుంచి కొనుగోలు చేసినట్లు చూపి మింగేశారు.

ఇదిగో ఆ చిట్టా..
► పద్మావతి ఎంటర్‌ప్రైజెస్‌ నుంచి రూ.2,172.75 కోట్ల విలువైన వస్తువులు కొనుగోలు చేసినట్లు రాయపాటి చూపించారు. కానీ పద్మావతి ఎంటర్‌ప్రైజెస్‌ టిన్‌ నెంబర్‌ 36200282035 పరిశీలిస్తే ఆ టిన్‌ నెంబర్‌తో ఎలాంటి సంస్థ ఏర్పాటు కాలేదని ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో వెల్లడైంది.
► బాలాజీ ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థ రూ.1,865.47 కోట్ల వస్తువులను ట్రాన్స్‌ట్రాయ్‌ కొనుగోలు చేసినట్లు చూపింది. కానీ పద్మావతి ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థ టిన్‌ నెంబర్‌తో ఈ కొనుగోళ్లు జరిపినట్లు ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో స్పష్టమైంది.
► రుత్విక్‌ అసోసియేట్స్‌ నుంచి రూ.1925.86 కోట్ల విలువైన వస్తువులను కొనుగోలు చేసినట్లు చూపారు. కానీ అలాంటి లావాదేవీలు జరగలేదని ట్రాన్స్‌ట్రాయ్‌ రికార్డుల్లో వెల్లడైంది. దీన్ని బట్టి అవన్నీ బోగస్‌ లావాదేవీలన్నది స్పష్టమవుతోంది.
► యూనిక్‌ ఇంజనీర్స్‌ నుంచి సంస్థ యజమాని ఎం.సాంబశివరావు పాన్‌ నెంబర్‌ ఏఎఫ్‌కేపీఎం1706ఎల్‌నే టిన్‌ నెంబర్‌గా చూపించి రూ.672.12 కోట్ల విలువైన వస్తువులు కొన్నట్లు చూపారు. ఈ సంస్థ నుంచి కొనుగోలు చేసిన సరుకును తరలించడానికి వినియోగించిన వాహనాల నెంబర్లను పరిశీలిస్తే అందులో అధిక శాతం ద్విచక్ర వాహనాలుగా తేలింది.

సబ్‌ కాంట్రాక్టర్ల ముసుగులో రూ.1,527.10 కోట్లు స్వాహా..
బోగస్‌ సంస్థల నుంచి కొనుగోలు చేయకుండానే చేసినట్లు చూపిన ఇనుము, సిమెంటు, కంకర, వాహనాలు లాంటి వాటిలో రూ.1,753.82 కోట్ల విలువైన సరుకు నిల్వ ఉన్నట్లు ట్రాన్స్‌ట్రాయ్‌ చూపించింది. ఇందులో ఒక్క పోలవరం ప్రాజెక్టు వద్దే రూ.1,527.10 కోట్ల విలువైన సామగ్రి నిల్వ చేసినట్లు చూపారు. ఇంత భారీ ఎత్తున ఒక ప్రాజెక్టు వద్ద సరుకును ఎలా నిల్వ చేస్తారని సీబీఐ అధికారులు ఆశ్చర్యపోయారు. పోలవరంలో పనులు  సబ్‌ కాంట్రాక్టర్లే చేశారు. ట్రాన్స్‌ట్రాయ్‌ తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. అలాంటి ట్రాన్స్‌ట్రాయ్‌ రూ.1,527.10 కోట్ల విలువైన సామగ్రిని పోలవరం పనుల కోసం కొనుగోలు చేసి నిల్వ ఉంచినట్లు చూపడమంటే ఆమేరకు దోపిడీ చేసినట్లు స్పష్టమవుతోంది.

దొంగ లెక్కలతో రూ.907.10 కోట్లు లూటీ..
ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థ ఆదాయ, వ్యయాలపై బ్యాలెన్స్‌ షీట్‌ను దొంగ లెక్కలతో భారీగా పెంచేసింది. వస్తువులు కొనకుండానే అధిక ధరలకు కొనుగోలు చేసినట్లు తప్పుడు రికార్డులు సృష్టించి రూ.907.10 కోట్లను రాయపాటి లూటీ చేసినట్లు ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో వెల్లడైంది. ట్రాన్స్‌ట్రాయ్‌ 24 ఎక్సవేటర్‌లను రూ.34.06 కోట్లకు కొన్నట్లు చూపింది. కానీ 8 ఎక్సవేటర్‌లను వోల్వో ఇండియా నుంచి కొనుగోలు చేసింది. మిగతా 16 కొనుగోలు చేయకుండానే కొన్నట్లు చూపించి నిధులు మింగేసింది. మరో 8 ఎక్సవేటర్లను రూ.14.67 కోట్లకు కొనుగోలు చేసినట్లు చూపింది. ఇందులో ఒకటి టాటా హిటాచీ, మూడు ఎల్‌అండ్‌టీ నుంచి కొనుగోలు చేసినట్లు చూపింది. మిగతా నాలుగు కొనుగోలు చేయకుండానే కొన్నట్లు చూపించి నిధులు కాజేసింది. పది టిప్పర్లను టాటా సంస్థ నుంచి కొనుగోలు చేసినట్లు ట్రాన్స్‌ట్రాయ్‌ చూపింది. నిజానికి ఐదు వాహనాలను మాత్రమే కొనుగోలు చేసి మిగిలిన ఐదు వాహనాలకు ఇవే ఛాసిస్‌ (లారీ బాడీ నెంబర్‌) నంబర్లు చూపించి నిధులను మింగేసింది. వాటికి రిజిస్ట్రేషన్‌ కూడా చేయించకపోవడం గమనార్హం.  

నకిలీ వాహనాలు రయ్‌.. రయ్‌!
► యూనిక్‌ ఇంజనీర్స్‌ అనే సంస్థ నుంచి 25.50 టన్నుల 10 ఎంఎం ఇనుప కడ్డీలను కొనుగోలు చేసి ఏపీ 12వీ 5408 నెంబరు బజాజ్‌ ఆటోలో పోలవరం పనులకు తరలించినట్లు చూపించారు. 
► పద్మావతి ఎంటర్‌ప్రైజెస్‌ నుంచి 16.60 మెట్రిక్‌ టన్నుల 10 ఎంఎ ఇనుప కడ్డీలను కొనుగోలు చేసి కేఏ 03 6894 నంబర్‌ కలిగిన టీవీఎస్‌ స్కూటీలో     తరలించినట్లు చూపారు. ఇంత ఇనుము ఓ చిన్న స్కూటీపై తరలించగలగడం ఎవరికైనా అసాధ్యమే కానీ ఘనాపాటి రాయపాటికి మాత్రం కాదు.  ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండా రూ.450 కోట్ల షేర్లు ఎవరైనా కొనగలరా? ట్రాన్స్‌ట్రాయ్‌లో రాయపాటి భార్య లీలాకుమారి, సమీప బంధువు చెరుకూరి శ్రీధర్‌లు రూపాయి పెట్టుబడి పెట్టకుండానే 2012 – 2014 మధ్య రూ.450 కోట్ల విలువైన షేర్లు కొన్నట్లు రికార్డుల్లో చూపించారు.  
ద్విచక్రవాహనాలపై అనేక మెట్రిక్‌ టన్నుల స్టీల్‌ తరలించినట్లు చూపిన నకిలీ బిల్లులు 

మరిన్ని వార్తలు