అమరావతిపై ఇక నివేదికలిస్తా

6 Aug, 2020 03:38 IST|Sakshi

నా సవాల్‌కు సీఎం జగన్‌ స్పందించ లేదు: ప్రతిపక్ష నేత చంద్రబాబు

ఏకైక రాజధానిగా ప్రకటిస్తే పదవులు వదులుకునేందుకు మేం సిద్ధం

సాక్షి, హైదరాబాద్‌: మూడు రాజధానులపై ప్రజాతీర్పు కోరేందుకు అసెంబ్లీని రద్దు చేయాలన్న తన సవాల్‌పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించకుండా పారిపోయారని ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శించారు. విభజన కంటే మూడు రాజధానుల ఏర్పాటుతోనే రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరగనుందన్నారు. 3 రాజధానులపై ప్రభుత్వానికి 48 గంటల డెడ్‌లైన్‌ విధిస్తున్నట్లు ప్రకటించిన చంద్రబాబు బుధవారం హైదరాబాద్‌ నుంచి ఎంపిక చేసిన మీడియాతో ఆన్‌లైన్‌లో మాట్లాడారు.

► రాజధానిగా అమరావతి ఎందుకు అవసరమో రెండు రోజులకోసారి ప్రజలకు నివేదికల రూపంలో వివరిస్తా. 
► అమరావతిని మార్చే హక్కు ఈ ప్రభుత్వానికి లేదు. మూడు ముక్కలాట ఆడుతూ అమరావతిని నాశనం చేస్తున్నారు. రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులతో చేసుకున్న ఒప్పందాన్ని కాపాడాలి. 
► రాజధాని అమరావతిని కాపాడాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా. అది కేంద్రం పరిధిలోని అంశం కాదని కొందరు బీజేపీ నేతలు చెప్పడం సరికాదు. 
► కరోనా వైరస్‌ ప్రబలుతున్న సమయంలో రాజధాని మార్పు గురించి ప్రభుత్వం ఆలోచిస్తుండటం ఏమిటి? రాజధానిగా అమరావతిని కాపాడుకునేందుకు ప్రజల్లో తిరుగుబాటు, చైతన్యం రావాలి. 
► మాట మార్చడం తమ ఇంటా వంటా లేదన్న సీఎం వైఎస్‌ జగన్‌ అమరావతిపై ఎందుకు మాటమార్చి ప్రజలను మోసం చేస్తున్నారు? ఇప్పటికైనా ప్రభుత్వం అమరావతిని పరిరక్షించాలి. 
► అమరావతిని ఏకైక రాజధానిగా ప్రభుత్వం ప్రకటిస్తే మేం పదవులను వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. మూడు రాజధానులను అడ్డుకుని తీరతాం. 

>
మరిన్ని వార్తలు